IND W vs AUS W 3rd T20: సిరీస్‌ ఎవరిదో? | IND W vs AUS W 3rd T20: India Women aim for series triumph over Australia in decider | Sakshi
Sakshi News home page

IND W vs AUS W 3rd T20: సిరీస్‌ ఎవరిదో?

Jan 9 2024 6:14 AM | Updated on Jan 9 2024 8:59 AM

IND W vs AUS W 3rd T20: India Women aim for series triumph over Australia in decider - Sakshi

నవీ ముంబై: మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్, ఆ్రస్టేలియా మహిళా జట్లు చెరొకటి గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పుడు సిరీస్‌ను గెలుచుకునేందుకు ఫైనల్‌ లాంటి పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ అయిన భారత అమ్మాయిలు ఇప్పుడు టి20 సిరీస్‌ను కోల్పోడానికి సిద్ధంగా లేరు. ఆఖరి పోరులో ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం బరిలోకి దిగుతోంది.

తద్వారా కొత్త ఏడాదిలో క్లీన్‌స్వీప్‌ పరాభవాన్ని మరిచేలా ఈ టి20 సిరీస్‌ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో నెగ్గినట్లే ఈ ఆఖరి పోరులోనూ దాన్ని పునరావృతం చేస్తే సిరీస్‌ కష్టం కానేకాదు. ముఖ్యంగా టాపార్డర్‌ బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమాలు రాణిస్తే తొలి మ్యాచ్‌ను గెలుచుకున్నంత సులభంగా సిరీస్‌నూ గెలుచుకోవచ్చు.

గత మ్యాచ్‌లో వీరి వైఫల్యమే జట్టును దెబ్బ తీసింది. దీంతో పాటు కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ వరుస వైఫల్యాలు జట్టుకు ప్రతికూలంగా మారాయి. ఈ నలుగురు కీలకమైన చివరి మ్యాచ్‌లో రాణిస్తే మాత్రం మన మహిళా జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్‌ నిలకడగా రాణిస్తున్నారు. ఆసీస్‌తో పోల్చుకుంటే భారత ఫీల్డింగ్‌ సాధారణంగా ఉంది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్‌కు ఫీల్డింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముంది.

మరోవైపు ఏకైక టెస్టు మ్యాచ్‌ ఓడాక అలీసా హీలీ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు దెబ్బతిన్న పులిలా వన్డేల్లో పంజా విసిరింది. తాజా టి20 సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడినా...    రెండో మ్యాచ్‌లో బదులు తీర్చుకుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో భారత గడ్డపై రెండో సిరీస్‌ విజయంపై కన్నేసింది.

Advertisement
 
Advertisement
Advertisement