టీమిండియా (PC: BCCI/X)
కొలంబోలో టీమిండియాతో రెండో టెస్టులో శ్రీలంక గెలవాలంటే అద్భుతం జరగాలి. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్లో పూర్తిగా వెనుకబడ్డ ఆతిథ్య జట్టు.. ఫాలో ఆన్ ఆడుతోంది. శ్రీలంక ఆశలన్నీ పసిందు సూరియబండారా, సొనాల్ దినుషలపైనే ఉన్నాయి.
అయితే, భారత బౌలర్లు విజృంభిస్తే మాత్రం శ్రీలంకకు భారీ ఓటమి తప్పదు. రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక మెరుగైన ఆరంభం అందుకున్నప్పటికీ టీమిండియానే శాసించే స్థితిలో ఉంది. ఈ మ్యాచ్లోనూ గిల్ సేన గెలవడం దాదాపు లాంఛనమే!.. ఇదిలా ఉంటే.. టెస్టు మ్యాచ్లో ఫాలో ఆడి మరీ గెలిచిన జట్లు ఏవో తెలుసా? ఈ జాబితాలో టీమిండియా కూడా ఉందండోయ్!!
(శ్రీలంకను ఫాలో ఆన్ ఆడిస్తున్న టీమిండియా)
ఆసీస్పై ఇంగ్లండ్ గెలుపు
హేమాహేమీలు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య 1894లో తొలిసారి టెస్టు మ్యాచ్ జరిగింది. సిడ్నీలో జరిగిన ఈ పోరులో ఆసీస్ 586 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. జార్జ్ జిఫేన్ సెంచరీ, సిడ్ గ్రెగరీ డబుల్ సెంచరీ కారణంగా ఈ స్కోరు సాధ్యమైంది.
ఇందుకు ప్రతిగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులే చేయడంతో.. కంగారూలు ఇంగ్లిష్ జట్టును ఫాలో ఆన్ ఆడించారు. అయితే, రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. 437 పరుగులు సాధించింది. తద్వారా ఆసీస్కు 177 పరుగుల లక్ష్యం విధించగా.. ఆతిథ్య జట్టు చేతులెత్తేసింది. దీంతో ఇంగ్లండ్ జయభేరి మోగించింది.

మరోసారి అదే ఫలితం
లీడ్స్ వేదికగా 1981లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్లో పర్యాటక ఆసీస్ తొలుత బ్యాటింగ్కు దిగి.. 401-9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జాన్ డైసన్ సెంచరీతో అలరించాడు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఇంగ్లండ్ను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్లో దిగ్గజ ఇయాన్ బోతమ్ సంచలన రీతిలో శతక్కొట్టడంతో ఇంగ్లండ్ 356 పరుగులు సాధించింది.
ఈ క్రమంలో 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. ఛేదనలో తడబడింది. ఫలితంగా ఇంగ్లండ్ 18 పరుగుల తేడాతో కంగారూలపై విజయం సాధించింది.

ఈసారీ బాధిత జట్టు ఆస్ట్రేలియానే.. గెలుపు మనదే
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్కు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 2001లో జరిగిన ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 445 పరుగులు సాధించింది.
అయితే, బ్యాటర్ల వైఫల్యం కారణంగా టీమిండియా 171 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారీ ఆధిక్యం సంపాదించిన ఆసీస్.. టీమిండియాను తక్కువగా అంచనా వేసి ఫాలో ఆన్ ఆడించింది.
రెండో ఇన్నింగ్స్లో మాత్రం భారత్ తడబడలేదు. వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ కలిసి అద్భుతం చేశారు. ద్రవిడ్ భారీ శతకం (180) సాధించగా.. లక్ష్మణ్ (281) తృటిలో ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా ఆసీస్కు 384 పరుగుల లక్ష్యం విధించింది.
అయితే, ఈసారి భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ 212 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 171 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

ఇంగ్లండ్కు షాకిచ్చిన న్యూజిలాండ్
వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్కు దిగింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జో రూట్ (153 నాటౌట్), హ్యారీ బ్రూక్ (186) శతకాలతో చెలరేగారు.
అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ 209 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కివీస్ను ఫాలో ఆన్ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్లో 483 పరుగులు సాధించింది. కేన్ విలియమ్సన్ సెంచరీ (132)తో ఆకట్టుకోగా.. టామ్ లాథమ్ (83), డెవాన్ కాన్వే (61), డారిల్ మిచెల్ (54), టామ్ బ్లండెల్ (90) అర్ధ శతకాలతో రాణించారు.
ఈ క్రమంలో 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో గెలిచిన కివీస్.. రెండు మ్యాచ్ల సిరీస్ను డ్రా చేసింది.


