అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ రద్దు.. ఎందుకో తెలుసా? | IND vs IRE 1st T20I: Why Was Abhishek Sharma Half Century Cancelled | Sakshi
Sakshi News home page

అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ రద్దు.. ఎందుకో తెలుసా?

Jun 27 2026 11:04 AM | Updated on Jun 27 2026 11:27 AM

IND vs IRE 1st T20I: Why Was Abhishek Sharma Half Century Cancelled

అభిషేక్‌ శర్మ (PC: BCCI X)

ఐర్లాండ్‌ పర్యటన ఆరంభంలోనే టీమిండియాకు చుక్కెదురైంది. టీ20 ప్రపంచకప్‌-2026 చాంపియన్స్‌ నిలిచిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. ఆతిథ్య ఐరిష్‌ జట్టు వరల్డ్‌కప్‌ విజేతను ఓ ఆట ఆడుకుంది.

బెల్‌ఫాస్ట్‌ వేదికగా సమిష్టి కృషితో రాణించి టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా అన్ని ఫార్మాట్లలోనూ ఐర్లాండ్‌ తొలిసారిగా భారత్‌పై గెలుపు రుచిచూసింది. ఇక ఈ సిరీస్‌తో టీమిండియా టీ20 కెప్టెన్‌గా ప్రయాణం ఆరంభించిన శ్రేయస్‌ అయ్యర్‌కు కూడా ఇది కోలుకోలేని దెబ్బే!

పెవిలియన్‌కు క్యూ
ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌ విధించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ ఆదిలోనే టపటపా వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (5) జై ముంద్రా పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (3)ను మ్యాట్‌ హోలార్డ్‌ అవుట్‌ చేశాడు.

ఇక నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (3)ను కూడా హోలార్డ్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం చేశాడు. తిలక్‌ వర్మ (19)ను మాథ్యూ హాంఫ్రేస్‌, వాషింగ్టన్‌ సుందర్‌ (9)ను హోలార్డ్‌ వెనక్కి పంపగా.. ఒంటరి పోరాటం చేసి శివం దూబే (14 బంతుల్లో 25) వికెట్‌ను జై ముంద్రా దక్కించుకున్నాడు.

 ఓవైపు వికెట్లు పడుతున్నా
మిగిలిన వారిలో అక్షర్‌ పటేల్‌ (15), హర్షిత్‌ రాణా (8), అర్ష్‌దీప్‌ సింగ్‌ (2) సైతం ఇలా వచ్చి అలా వెళ్లారు. అయితే, ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఏకైక భారత ఆటగాడు అభిషేక్‌ శర్మ మాత్రమే. ఓవైపు వికెట్లు పడుతున్నా ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ మాత్రం దూకుడుగానే ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు జమ చేశాడు.

ఈ క్రమంలోనే అభిషేక్‌ శర్మ 19 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఇందుకు సంబంధించిన బీసీసీఐ ట్వీట్‌ కూడా చేసింది. ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ సైతం తన కెరీర్‌లోని మరో ‘ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ’ని సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అయితే, ఆ వెంటనే లియామ్‌ మెకర్తీ బౌలింగ్‌లో బెంజమిన్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ పెవిలియన్‌కు చేరాడు.

కథలో అసలు మలుపు 
అప్పుడే కథలో అసలు మలుపు వచ్చింది. అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీని రద్దు చేసినట్లు స్కోరు బోర్డులో రివైజ్డ్‌ స్కోరు వచ్చింది. ఇందుకు కారణం జై ముంద్రా బౌలింగ్‌ (భారత్‌ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌)లో అభిషేక్‌ శర్మ సింగిల్‌ తీశాడు. అయితే, ఆ తర్వాత అది లెగ్‌బైగా తేలింది. దీంతో అభిషేక్‌ ఖాతా నుంచి ఆ పరుగు మైనస్‌ అయింది. ఫలితంగా 20 బంతుల్లో అభిషేక్‌ శర్మ 49 పరుగులు చేసినట్లు తేలింది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?
వైడ్‌ల మాదిరే లెగ్‌బై కూడా అదనపు పరుగుల్లో భాగం. బంతి బ్యాట్‌కు కాకుండా బ్యాటర్‌ శరీరానికి (బ్యాట్‌ పట్టుకున్న చేయి, గ్లోవ్స్‌ మినహా) తాకినా.. ఆ సమయంలో బ్యాటర్‌కు పరుగులు తీసే అవకాశం వచ్చినా.. లేదంటే బంతి బౌండరీని తాకినా జట్టు ఖాతాలో పరుగులు జమ అవుతాయి.

కానీ బ్యాటర్‌ వ్యక్తిగత ఖాతాలో మాత్రం ఈ పరుగులు కౌంట్‌ అవ్వవు. అభిషేక్‌ శర్మ విషయంలో ఇదే జరిగింది. ముంద్రా బౌలింగ్‌లో వచ్చిన లెగ్‌బై టీమిండియా ఖాతాలో చేరి.. అతడి ఖాతా నుంచి మైనస్‌ అయింది. అయితే, ఇక్కడ అభిషేక్‌ అవుటైన తర్వాత అంపైర్లు ఈ విషయాన్ని గుర్తించడం వివాదానికి, గందరగోళానికి కారణమైంది. 

ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ 49 పరుగులతో భారత్‌ తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా... మిగిలిన బ్యాటర్ల వైఫల్యం కారణంగా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా 34 పరుగుల తేడాతో ఓటమి పాలై 0-1తో వెనుబడింది.

చదవండి: కెప్టెన్‌గా నాకిది గొప్ప ఆరంభం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement