IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే! | IND vs AFG 3rd ODI: Aakash Chopra picks Playing 11 Leaves out Arshdeep | Sakshi
Sakshi News home page

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

Jun 19 2026 5:14 PM | Updated on Jun 19 2026 5:45 PM

IND vs AFG 3rd ODI: Aakash Chopra picks Playing 11 Leaves out Arshdeep

అఫ్గానిస్తాన్‌తో నామమాత్రపు మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఈ మ్యాచ్‌కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే లక్నో నుంచి చెన్నైకి చేరుకుంది.

ఇదిలా ఉంటే.. అఫ్గాన్‌తో మూడో వన్డే కోసం భారత యువ పేసర్‌ హర్షిత్‌ రాణా జట్టుతో చేరాడు. గాయం నుంచి కోలుకున్న అతడు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని యాజమాన్యం ప్రకటించింది.

రెండో వన్డేకు మూడు మార్పులు
కాగా ధర్మశాల వేదికగా తొలి వన్డేలో అఫ్గాన్‌ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ సందర్భంగా పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌, స్పిన్నర్‌ హర్ష్‌ దూబే అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్‌లోనే ఇద్దరూ మూడేసి వికెట్లు కూల్చారు.

అయితే, రెండో మ్యాచ్‌కు హర్ష్‌ దూబే దూరం కాగా.. కుల్దీప్‌ యాదవ్‌ ఆడాడు. అదే విధంగా నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ప్రసిద్‌ కృష్ణల స్థానంలో యశస్వి జైస్వాల్‌, ప్రిన్స్‌ యాదవ్‌ తుదిజట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 170 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది.

అర్ష్‌దీప్‌ సింగ్‌ను పక్కన పెట్టి..
ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేస్తారోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తన ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. అఫ్గాన్‌తో మూడో వన్డేలో అర్ష్‌దీప్‌ సింగ్‌ను పక్కన పెట్టి.. నితీశ్‌ రెడ్డిని ఆడించాలని సూచించాడు.

ఈ మేరకు.. ‘‘యశస్వి ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అతడికి మరో అవకాశం ఇస్తే బాగుంటుంది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఫిట్‌గా ఉంటే.. అతడిని కచ్చితంగా ఆడించాలి. నితీశ్‌ కోసం అర్ష్‌దీప్‌ సింగ్‌కు విశ్రాంతినివ్వాలి.

ఏదేమైనా విరాట్‌ కోహ్లి తిరిగి వస్తే.. ఇషాన్‌ కిషన్‌కు తుదిజట్టులో చోటు ఉండదు. అయితే, రెండో వన్డేలో అతడు శతక్కొట్టాడు. కాబట్టి ఇషాన్‌ను పక్కనపెట్టే వీలులేదు. పేస్‌ దళంలో గుర్నూర్‌ బ్రార్‌, ప్రిన్స్‌ యాదవ్‌లను ఆడించాలి’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేకు ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టు
రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, గుర్నూర్‌ బ్రార్‌, ప్రిన్స్‌ యాదవ్‌.

చదవండి: భారత క్రికెట్‌కు గుడ్‌బై... వేరే దేశంలో ఆడనున్న తెలుగు క్రికెటర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement