ఇటీవల భారత క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఆంధ్ర ప్లేయర్ కె.ఎస్. భరత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన కేవలం 15 రోజుల్లోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు భరత్ సిద్దమయ్యాడు. యూఏఈ క్రికెట్ బోర్డు నిర్వహించనున్న స్థానిక టోర్నమెంట్లో 'టీమ్ స్టాలియన్స్' (Team Stallions) జట్టు తరపున భరత్ ఆడనున్నాడు.
అయితే 32 ఏళ్ల శ్రీకర్ భరత్ వెంటనే యూఏఈ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫుల్ మెంబర్ నేషన్ నుంచి అసోసియేట్ దేశానికి వెళ్లే ఆటగాళ్లు మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్ను పూర్తి చేయాలి. అయితే ఫిబ్రవరి 2024లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్లో భారత్ తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
అంటే అతడు యూఏఈ తరపున ఆడాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సిందే. ఈ విశాఖ క్రికెటర్ భారత్ తరపున 7 టెస్ట్ మ్యాచ్లు ఆడి 221 పరుగులు చేశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో మాత్రం భరత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 113 ఇన్నింగ్స్లలో 36.53 సగటుతో 6102 పరుగులు చేశాడు. అతడి పేరిట ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. లిస్ట్-ఎ క్రికెట్లో కూడా అతడు అద్భుతంగా రాణించాడు. 83 మ్యాచ్లలో 2692 పరుగులు చేశాడు.
ఇక తమ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లలో లాంగ్-ఫార్మాట్ స్కిల్స్ను పెంపొందించే లక్ష్యంతో ఈసీబీ ఈ టూ-డే వైట్-బాల్ ఛాంపియన్షిప్ టోర్నీని నిర్వహించనుంది. ఈ టోర్నీలో టీమ్ స్టాలియన్స్, టీమ్ ఫాల్కన్స్, టీమ్ ఈగల్స్, టీమ్ లెపర్డ్స్ మొత్తం నాలుగు జట్లు పాల్గోనున్నాయి.
చదవండి: 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. 7 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం


