PC: ICC
అఫ్గానిస్తాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. కాగా అఫ్గాన్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఐరిష్ జట్టుతో ఐదు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు పూర్తి కాగా.. తొలి వన్డే వర్షం వల్ల రద్దైపోయింది. రెండు, మూడో వన్డేల్లో గెలిచి అఫ్గాన్ పటిష్ట స్థితిలో నిలిచింది. అంతేకాదు ప్రపంచకప్-2027 టోర్నీకి నేరుగా అర్హత సాధించింది కూడా!
అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ
ఇదిలా ఉంటే.. ఐర్లాండ్తో శుక్రవారం జరిగిన రెండో వన్డే సందర్భంగా అజ్మతుల్లా ఒమర్జాయ్ నిబంధనలు అతిక్రమించాడు. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా అతడికి శిక్ష విధించిన విషయాన్ని ప్రకటించింది.
కారణం ఇదే
‘‘ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.8 నిబంధనను అజ్మతుల్లా ఒమర్జాయ్ ఉల్లంఘించాడు. అంతర్జాతీయ మ్యాచ్లో అంపైర్ నిర్ణయాన్ని అతడు వ్యతిరేకించాడు. నిబంధనల ప్రకారం.. అతడిని మందలిస్తూ.. గత 24 నెలల కాలంలో ఇదే మొదటి తప్పు కాబట్టి.. క్రమశిక్షణా పట్టికలో ఒక డిమెరిట్ పాయింట్ జతచేయడమైనది’’ అని ఐసీసీ సదరు ప్రకటనలో పేర్కొంది.
కాగా అఫ్గాన్- ఐర్లాండ్ మధ్య రెండో వన్డేను వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో 41వ ఓవర్లో ఒమర్జాయ్ అవుటైనట్లు అంపైర్ ప్రకటించాడు. కానీ అతడు క్రీజును వీడకుండా తన చర్యల ద్వారా అంపైర్ నిర్ణయం పట్ల అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశాడు.
విచారణలో భాగంగా అతడు తన తప్పును అంగీకరించడంతో తదుపరి చర్యలేమీ లేకుండా ఈ మేరకు పనిష్మెంట్తో ఐసీసీ సరిపెట్టింది. ఈ మ్యాచ్లో అజ్మతుల్లా 24 బంతుల్లో 33 పరుగులు చేశాడు. జై ముంద్రా బౌలింగ్లో లోర్కాన్ టక్కర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్గా SRH మాజీ ప్లేయర్


