
మే 29న ఇంగ్లండ్తో వన్డే మ్యాచ్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వెస్టిండీస్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఆ జట్టు ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘణ స్లో ఓవర్ రేట్ పరిధిలోకి వస్తుంది. ఆ మ్యాచ్లో విండీస్ అదనపు సమయం ముగిసినా తమ కోటా ఓవర్లు (50) పూర్తి చేయలేకపోయింది. ఓ ఓవర్ వెనకపడింది.
దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో విండీస్ జట్టులోని ఆటగాళ్లందరికీ ఐదు శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధించాడు. ఈ జరిమానాను విండీస్ జట్టు సభ్యులు సవాలు చేయకుండా స్వీకరించారు. సాధారణంగా నిర్ణీత సమయంలోగా కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్కు ఐదు శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధిస్తారు.
ఇదిలా ఉంటే, మూడు వన్డేలు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు మే 29న తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల రికార్డు స్కోర్ చేసింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ (60), జో రూట్ (57), హ్యారీ బ్రూక్ (58), జేకబ్ బేతెల్ (82) అర్ద సెంచరీలతో చెలరేగగా.. జేమీ స్మిత్ (37), జోస్ బట్లర్ (37), విల్ జాక్స్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 4, అల్జరీ జోసఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 26.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ తలో 3, ఆదిల్ రషీద్ 2, బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో 11వ నంబర్ ఆటగాడు జేడెన్ సీల్స్ (29 నాటౌట్) టాప్ స్కోరర్గా కాగా.. షాయ్ హోప్ (25), కీసీ కార్టీ (22) 20కి పైగా పరుగులు చేశారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇవాళ (జూన్ 1) రెండో వన్డే జరుగుతుంది.