జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ జట్టు (Jammu & Kashmir Cricket Team) చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) తొలిసారి ఢిల్లీని ఓడించింది (7 వికెట్ల తేడాతో). టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 43 సార్లు తలపడగా జమ్మూ తొలిసారి విజయం సాధించింది. ఏడు సార్లు ఛాంపియన్ అయిన ఢిల్లీని జమ్మూ వారి సొంత మైదానంలో (అరుణ్ జైట్లీ స్టేడియం) ఓడించింది.
🚨 A HISTORIC DAY IN JAMMU & KASHMIR CRICKET 🚨
- Jammu & Kashmir has defeated Delhi for the first time in Ranji Trophy history. 🔥🤯 pic.twitter.com/VxNFBOj7QW— Johns. (@CricCrazyJohns) November 11, 2025
ఈ గెలుపుతో రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్పై ఢిల్లీ ఆధిపత్యానికి తెర పడింది. యువకులు, అనుభవజ్ఞులతో కూడిన ప్రస్తుత జమ్మూ జట్టు ఆ ప్రాంత క్రికెట్ అభిమానుల దశాబ్దాల కలను నెరవేర్చింది. ఢిల్లీ లాంటి అగ్రశ్రేణి జట్టును, వారి సొంత మైదానంలో ఓడించడమంటే ఆషామాషీ విషయం కాదు. ఈ గెలుపుతో ప్రస్తుత జమ్మూ జట్టు వారి ప్రాంత యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకంగా నిలిచింది.
179 పరుగుల లక్ష్య ఛేదనలో కమ్రాన్ ఇక్బాల్ చారిత్రక శతకం (133 నాటౌట్) సాధించి జమ్మూ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన జమ్మూ.. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ను 211 పరుగులకే కుప్పకూల్చింది.
సంచలన పేసర్ ఆకిబ్ నబీ 5 వికెట్ల ప్రదర్శనతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. వన్ష్రాజ్ శర్మ, ఆబిద్ ముస్తాక్ తలో 2 వికెట్లు తీసి ఢిల్లీ పతనంలో తమవంతు పాత్ర పోషించారు.
అనంతరం బరిలోకి దిగిన జమ్మూ.. కెప్టెన్ పరాస్ డోగ్రా (106) సెంచరీతో కదంతొక్కడంతో 310 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (85), కన్హయ్య (47) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ 6 వికెట్లు తీశాడు.
99 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ.. ఈసారి కూడా తడబడింది. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినా చివరికి 277 పరుగులకే పరిమితమై, జమ్మూ ముందు 179 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని జమ్మూ ఆడుతూపాడుతూ ఛేదించింది.
ఓపెనర్ కమ్రాన్ అజేయ శతకంతో జమ్మూను గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ గెలుపు జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.
చదవండి: శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!


