టాప్‌-10లోకి హర్మన్‌.. సెంచరీ చేసినా మంధనకు నిరాశే..! | Harmanpreet Enters Top 10, Smriti Mandhana Fails To Benefit After Century In Latest ICC Ranking | Sakshi
Sakshi News home page

టాప్‌-10లోకి హర్మన్‌.. సెంచరీ చేసినా మంధనకు నిరాశే..!

Nov 5 2024 6:29 PM | Updated on Nov 5 2024 6:34 PM

Harmanpreet Enters Top 10, Smriti Mandhana Fails To Benefit After Century In Latest ICC Ranking

ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ భారీగా లబ్ది పొందింది. గత వారం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన హర్మన్‌.. మూడు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరింది. న్యూజిలాండ్‌ సిరీస్‌ చివరి రెండు ఇన్నింగ్స్‌ల్లో హర్మన్‌ 83 పరుగులు చేసింది. ఇందులో సిరీస్‌ డిసైడర్‌లో చేసిన ఓ హాఫ్‌ సెంచరీ కూడా ఉంది. ఈ సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

సెంచరీ చేసినా మంధనకు నిరాశే..!
తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధనకు ఎలాంటి లబ్ది చేకూరలేదు. న్యూజిలాండ్‌ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో సెంచరీ చేసినా మంధన ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఆమె తన ర్యాంకింగ్‌ పాయింట్లను గణనీయంగా మెరుగుపర్చుకుంది. ఈ వారం ర్యాంకింగ్‌ పాయింట్స్‌లో మంధన 703 నుంచి 728 పాయింట్లకు ఎగబాకింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న మంధనకు మూడో ప్లేస్‌లో ఉన్న చమారీ ఆటపట్టుకు కేవలం ఐదు పాయింట్ల డిఫరెన్స్‌ మాత్రమే ఉంది.

ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన నాట్‌ సీవర్‌ బ్రంట్‌ టాప్‌లో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్‌ రెండో స్థానంలో ఉంది. భారత ప్లేయర్లలో దీప్తి శర్మ 20వ స్థానంలో ఉండగా.. జెమీమా రోడ్రిగెజ్‌ 30వ స్థానంలో ఉంది.

బౌలింగ్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌ సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌ల్లో ఆరు వికెట్లు తీసిన దీప్తి శర్మ రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్‌ టాప్‌లో తన హావా కొనసాగిస్తుంది. దీప్తికి సోఫీకి మధ్య 67 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఈ వారం ర్యాంకింగ్స్‌లో భారత పేసర్‌ రేణుక సింగ్‌ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి ఎగబాకగా.. మరో ఇద్దరు భారత బౌలర్లు ప్రియా మిశ్రా, సోయ్‌మా ఠాకోర్‌ టాప్‌-100లోకి ఎంటర్‌ అయ్యారు.

 

Advertisement
 
Advertisement
Advertisement