
రాజ్కోట్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్కు ఘోర పరాభావం ఎదురైంది. భారత్ చేతిలో ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల దాటికి 122 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లండ్ను దెబ్బతీశాడు.
సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా దారుణంగా విఫలమైంది. కనీసం పోటీ ఇవ్వకుండానే ఇంగ్లీష్ జట్టు చేతులేత్తేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో లోయార్డర్ ఆటగాడు మార్క్ వుడ్(33) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో ఘోర ఓటమిని చవిచూసిన ఇంగ్లండ్ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పింది.
టెస్టులలో ఇంగ్లండ్ జట్టుకు పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద ఓటమి. ఇంతకుముందు ఆ జట్టు 1934లో ఆస్ట్రేలియా చేతిలో 562 రన్స్ తేడాతో ఓడింది. అయితే 21వ శతాబ్దంలో మాత్రం ఇంగ్లండ్ ఇదే అతి పెద్ద ఓటమి.
మరోవైపు భారత్ మాత్రం టెస్టు క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్ కంటే ముందు 2021లో న్యూజిలాండ్పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం. ఇక ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: అతడొక సంచలనం.. ఎంత చెప్పుకున్నా తక్కువే: రోహిత్ శర్మ