IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్‌ దూరం.. కెప్టెన్‌గా అతడు! | Gill to Lead India in CT 2025, As injured Rohit Might be Rested vs NZ: Report | Sakshi
Sakshi News home page

IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్‌ దూరం.. కెప్టెన్‌గా అతడు!

Feb 28 2025 11:28 AM | Updated on Feb 28 2025 12:29 PM

Gill to Lead India in CT 2025, As injured Rohit Might be Rested vs NZ: Report

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్లో ఇప్పటికే సెమీ ఫైనల్‌ చేరుకున్న రోహిత్‌ సేన.. న్యూజిలాండ్‌తో ఆదివారం నామమాత్రపు మ్యాచ్‌ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రోహిత్‌కు రెస్ట్‌ ఇవ్వడమే మంచిది
పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా హిట్‌మ్యాన్‌ పిక్కల నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైదానం వీడి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ఫీల్డింగ్‌కు వచ్చాడు. అయితే, నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. దుబాయ్‌లో జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లోనూ అతడు బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. దీంతో కివీస్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉండాలని రోహిత్‌ శర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

సెమీస్‌ మ్యాచ్‌ మార్చి 4, 5 తేదీల్లోనే జరుగనున్న తరుణంలో రోహిత్‌కు విశ్రాంతిన్విడమే మంచిదని యాజమాన్యం కూడా భావిస్తున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌(Shubman Gill) తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 

గిల్‌తో పాటు ఓపెనర్‌గా రాహుల్‌
అయితే, గిల్‌ జ్వరంతో బాధపడుతున్నాడని వార్తలు రాగా.. ఆప్షనల్‌ నెట్‌ సెషన్‌లో అతడు గంటలపాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడంతో వాటికి చెక్‌ పడింది.

ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ గనుక దూరమైతే గిల్‌కు ఓపెనింగ్‌ జోడీగా కేఎల్‌ రాహుల్‌ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక గ్రూప్‌-‘ఎ’ నుంచి కివీస్‌ కూడా భారత్‌తో పాటు సెమీస్‌ చేరిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో మార్చి 2 నాటి మ్యాచ్‌లో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీ ఫైనల్‌ బరిలో దిగాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆధారంగానే గ్రూప్‌-‘ఎ’ విజేతతో పాటు సెమీస్‌ ప్రత్యర్థి ఎవరన్నది తేలనుంది.

కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 మొదలైంది. గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌.. గ్రూప్‌-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ బరిలో నిలిచాయి. 

అయితే, గ్రూప్‌-‘ఎ’లో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడటంతో పాటు.. తమ మధ్య ఆఖరి మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కావడంతో పాక్‌- బంగ్లా కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించాయి. ఇక గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌ ఇంటిబాటపట్టింది. ఇక ఈ టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లు అన్నీ దుబాయ్‌లో ఆడుతోంది.

చదవండి: అఫ్గన్‌ చేతిలో ఓటమి.. బట్లర్‌ సంచలన నిర్ణయం?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement