రింకూ సింగ్‌ విఫలం.. వైభవ్‌ సూర్యవంశీ దంచికొడితే! | DT 2026: All Eyes On Vaibhav Sooryavanshi East Zone Need 159 Win | Sakshi
Sakshi News home page

రింకూ సింగ్‌ విఫలం.. వైభవ్‌ సూర్యవంశీ దంచికొడితే!

Sep 1 2026 1:13 PM | Updated on Sep 1 2026 1:34 PM

DT 2026: All Eyes On Vaibhav Sooryavanshi East Zone Need 159 Win

PC: BCCI Domestic X

దులిప్‌ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సెంట్రల్‌ జోన్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ వరుస విరామాల్లో వికెట్లు కూల్చారు. ఫలితంగా సెంట్రల్‌ జోన్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే కుప్పకూలింది.

నామమాత్రపు లక్ష్యం
తద్వారా ఈస్ట్‌ జోన్‌కు 159 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని విధించగలిగింది. కాగా బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ సెమీస్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఈస్ట్‌ జోన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గాయపడగా.. అతడి డిప్యూటీ వైభవ్‌ సూర్యవంశీ తొలిరోజే తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు.

ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌ జోన్‌.. సెంట్రల్‌ జోన్‌ను 266 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ముకేశ్‌ కుమార్‌, అభిజీత్‌ సర్కార్‌ మూడేసి వికెట్లు కూల్చగా.. మహ్మద్‌ షమీ, ఎండీ కౌనియన్‌ ఖురేషి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

టీ20 ఫార్మాట్‌ తరహాలో ధనాధన్‌
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్‌ జోన్‌ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా 266 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈస్ట్‌ జోన్‌ ఈ స్కోరు చేయడంలో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌, వైభవ్‌ సూర్యవంశీదే కీలక పాత్ర. అభిమన్యు అర్ధ శతకం (106 బంతుల్లో 69)తో ఆకట్టుకోగా.. వైభవ్‌ మాత్రం టీ20 ఫార్మాట్‌ తరహాలో ధనాధన్‌ దంచికొట్టాడు.

అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 92 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో సుదీప్‌ ఘరామి (25) ఒక్కడే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు.

చెలరేగిన ముకేశ్‌ కుమార్‌, షమీ
ఈ క్రమంలో రెండో రోజు తమ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన సౌత్‌ జోన్‌.. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.  ఇక మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 158 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్లలో అమన్‌ మోఖడే (41) రాణించాడు. సౌత్‌ జోన్‌ ఇన్నింగ్స్‌లో అతడిదే టాప్‌ స్కోరు.

మిగిలిన వారిలో రింకూ సింగ్‌ (20) నిరాశపరచగా.. హర్ష్‌ దూబే 24, అర్షద్‌ ఖాన్‌ 25 పరుగులు రాబట్టారు. ఈస్ట్‌ జోన్‌ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్‌ షమీ మూడు వికెట్లు కూల్చాడు. అనుకుల్‌ రాయ్‌, ఎండీ కౌనియన్‌ ఖురేషి, అభిజిత్‌ సర్కార్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మూడో రోజు ఆట సందర్భంగా ఈస్ట్‌ జోన్‌ సారథి ఇషాన్‌ కిషన్‌ తిరిగి వచ్చాడు. దీంతో బ్యాటింగ్‌ లైనప్‌ మరింత పటిష్టమైంది.

ఇక సౌత్‌ జోన్‌ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఈస్ట్‌ జోన్‌ బరిలోకి దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరే వైభవ్‌ సూర్యవంశీ దంచికొడితే మాత్రం ఈస్ట్‌ జోన్‌ సులువుగానే ఫైనల్‌ చేరడం ఖాయం.

చదవండి: భారత్‌తో సిరీస్‌.. ఆసీస్‌ జట్ల ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement