పాపం వైభవ్‌ సూర్యవంశీ!.. చరిత్రకెక్కినా చేదు అనుభవం! | Vaibhav Sooryavanshi Dismissed On 92 Misses All Time Record | Sakshi
Sakshi News home page

పాపం వైభవ్‌ సూర్యవంశీ!.. చరిత్రకెక్కినా చేదు అనుభవం!

Aug 31 2026 12:00 PM | Updated on Aug 31 2026 12:18 PM

Vaibhav Sooryavanshi Dismissed On 92 Misses All Time Record

వైభవ్‌ సూర్యవంశీ (PC: Jiohotstar.x)

టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీకి చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో సెంచరీ చేసే అవకాశాన్ని ఈ పదిహేనేళ్ల పిల్లాడు మరోసారి తృటిలో చేజార్చుకున్నాడు. కాగా దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్‌ టోర్నీ దులిప్‌ ట్రోఫీ-2026లో వైభవ్‌ సూర్యవంశీ ఈస్ట్‌ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సెమీ ఫైనల్లో భాగంగా కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గాయపడగా.. అతడి డిప్యూటీ అయిన వైభవ్‌ తాత్కాలిక సారథిగా పగ్గాలు చేపట్టాడు. బెంగళూరు వేదికగా ఆదివారం సెంట్రల్‌ జోన్‌తో మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఈస్ట్‌ జోన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఈస్ట్‌ జోన్‌కు అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి వైభవ్‌ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. కేవలం 42 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డ ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

 

ఇదే జోరు కొనసాగిస్తూ వైభవ్‌ సూర్యవంశీ సెంచరీకి చేరువయ్యాడు. అయితే, 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్ష్‌ దూబే బౌలింగ్‌లో అర్షద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ పెవిలియన్‌కు చేరాడు. 

మొత్తంగా 81 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదిన వైభవ్‌ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 93. ఇప్పుడు 92 పరుగుల వద్ద అవుటై దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్‌ అయ్యాడు.

తొలి ప్లేయర్‌గా ఘనత
కాగా సెంచరీ చేజార్చుకున్నప్పటికీ అత్యంత పిన్న వయసులోనే దులిప్‌ ట్రోఫీలో హాఫ్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌గా వైభవ్‌ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. 15 ఏళ్ల 157 రోజుల వయసులో అతడు ఈ ఘనత సాధించాడు.

ఆల్‌ టైమ్‌ రికార్డు మిస్‌
అయితే, కాస్త నెమ్మదిగా ఆడి ఉంటే.. దులిప్‌ ట్రోఫీ చరిత్రలో అత్యంత చిన్న వయసులోనే శతక్కొట్టిన ప్లేయర్‌గా వైభవ్‌ సూర్యవంశీ ఆల్‌టైమ్‌ రికార్డు సాధించేవాడు. కానీ హర్ష్‌ దూబే బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన వైభవ్‌ విఫలమయ్యాడు. బంతిని గాల్లోకి లేపగా డీప్‌ మిడ్‌వికెట్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న అర్షద్‌ క్యాచ్‌ పట్టడంతో వైభవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇదిలా ఉంటే.. అభిమన్యు ఈశ్వరన్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

భోజన విరామ సమయానికి ఈస్ట్‌ జోన్‌ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్‌ 58, సుదీప్‌ కుమార్‌ ఘరామీ 16 పరుగులతో క్రీజులో నిలిచారు. వైభవ్‌ అవుటైన వెంటనే వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుమార్‌ కుశాగ్రా డకౌట్‌గా వెనుదిరిగాడు.

చదవండి: అదంతా నాటకం: పాక్‌ ఓపెనర్‌పై ఇంగ్లండ్‌ దిగ్గజం ఫైర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement