కామన్వెల్త్ గేమ్స్లో దిలీప్ పసిడి పరుగు
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా తొరన్ డోంగ్రీ గ్రామానికి చెందిన దిలీప్ మహాడు గావిత్... ఆరేళ్ల వయసులో చేయి కోల్పోయాడు. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న దిలీప్ చెట్టుపై నుంచి కిందపడగా... పసరు వైద్యాన్నే నమ్ముకున్న అతడి ఆదివాసీ తల్లిదండ్రులు సకాలంలో వైద్యం అందించలేకపోయారు. దీంతో అతడి కుడి చేతిని మోచేయి కింది వరకు తొలగించాల్సి వచ్చింది. అసలే కూలీనాలీ చేసుకునే కుటుంబంలో ఒక చేయి కోల్పోవడంతో దిలీప్ మరింత కుంగిపోయాడు. ఆత్మన్యూనత భావంతో చదువుకన్నా ఎక్కువ మైదానంలోనే గడిపేవాడు.
ఈ సమయంలోనే ప్రముఖ కోచ్ వైజనాథ్ కాలే దృష్టి అతడిపై పడింది. సాధారణ పిల్లలతో పోటీపడి పరుగులు తీస్తున్న అతడిలో ఏదో ప్రత్యేకత ఉందని వైజనాథ్ గుర్తించారు. ‘అతడిని ఓ పాఠశాలలో చూశాను. పదకొండేళ్ల ప్రాయంలో అతడు పరుగు తీస్తున్న తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. సరైన కోచింగ్ ఇస్తే అద్భుతాలు చేయగలడనిపించింది. ఇదే విషయాన్ని అతడి తల్లిదండ్రులకు చెప్పినా వారు అర్థం చేసుకోలేకపోయారు.
పారా పోటీలు ఉంటాయనే విషయమే వారికి తెలియదు. దీంతో కేవలం మెరుగైన జీవితం అందిస్తానని చెప్పి అతడిని నా వెంట తీసుకొచ్చా. అప్పటి నుంచి అన్నీ నేనే అయి పెంచాను. దత్తత తీసుకున్నా. ఇంటి పేరు లేకున్నా అతడు నా కుమారుడే’ అని వైజనాథ్ గర్వంగా చెప్పారు. కోచ్ సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగిన దిలీప్... అనతికాలంలోనే మంచి గుర్తింపు సాధించాడు. అండర్–18 స్థాయిలో పలు పతకాలు సాధించిన దిలీప్... ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మెరిశాడు.
తాజాగా గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల పురుషుల 100 మీటర్ల టి47 విభాగంలో దిలీప్ 10.71 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకం సాధించాడు. రేసు ముగిసిన వెంటనే అగ్రస్థానంలో నిలిచిన దిలీప్ను తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీపడుతుండగా... అతడు మాత్రం తన గురువు కోసం వెతుక్కుంటూ కనిపించాడు. ఒక్కసారిగా అతడు కనిపించగానే పట్టరాని ఆనందంతో ఎగిరి గంతేశాడు. ‘ఆశించిన స్థాయిలో రేసును ప్రారంభించలేకపోయా. అయినా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చివర్లో వేగం పెంచి ఫలితం రాబట్టా’ అని దిలీప్ పేర్కొన్నాడు.

భారీ వర్షంలో జరిగిన ఫైనల్ రేసులో పరిస్థితులు పరీక్షిస్తున్నా... మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన దిలీప్ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ‘ఈ విజయంతో ఆగిపోవాలని అనుకోవడం లేదు. ప్రస్తుతానికి ఉద్యోగం చేయాలనే ఆలోచన లేదు. దేశానికి వీలైనన్ని ఎక్కువ పతకాలు సాధించడమే నా ముందున్న లక్ష్యం. సెపె్టంబర్లో జరగనున్న పారా ఆసియా క్రీడలతో పాటు, 2028 లాస్ ఏంజెలిస్ పారాలింపిక్స్లో పతకాలు సాధించేందుకు కృషి చేస్తా. పారా ఆసియా క్రీడల్లో 100 మీటర్లతో పాటు 400 మీటర్ల విభాగంలోనూ పోటీ పడతా.
నా పతకం వెనక కర్త, కర్మ, క్రియ... నా గురువు వైజనాథ్. ఆయనే లేకుంటే నేను ఈ రోజు ఎక్కడ ఉండేవాడినో. 11 ఏళ్ల వయసు నుంచి నాకు అన్నీ ఆయనే. వాళ్లింట్లోనే పెరిగా. మెరుగైన జీవితాన్నిస్తా అని ఆయన ఇచ్చిన మాటకు బదులుగా ఈ రోజు నేను కామన్వెల్త్ స్వర్ణాన్ని గురువుకు అంకితమిస్తున్నా. ఈ పతకం మాత్రమే కాదు ఈ జీవితం కూడా ఆయానదే. గురు పూర్ణిమ రోజు తండ్రిలాంటి గురువుకు అంతర్జాతీయ పతకం కానుకగా ఇవ్వడం ఆనందంగా ఉంది’ అని దిలీప్ భావోద్వేగానికి గురయ్యాడు.
– సాక్షి క్రీడా విభాగం


