టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మూడో రోజుల్లోనే ముగిసింది. మ్యాచ్లో టీమిండియా ఆఫ్గన్ను ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టీమిండియా స్పిన్నర్లు మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను తిప్పేయడంతో అఫ్గానిస్తాన్ వద్ద సమాధానం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలోనే టీమిండియా భారీ విజయం సాధించినప్పటికీ ఆఫ్గన్ ఇన్నింగ్స్ ఆఖర్లో గందరగోళం నెలకొంది. ఆఫ్గన్ ఇన్నింగ్స్లో 35.5 ఓవర్లో మొహమ్మద్ సలీమ్ సఫీ 9వ వికెట్గా వెనుదిరిగిన తర్వాత ఆఫ్గన్ ఆలౌటైనట్లు బిగ్స్క్రీన్పై వచ్చింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు సహా మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురయ్యారు.
మరో వికెట్ ఉండగానే ఆలౌట్ ప్రకటించడం ఏంటని చర్చించుకున్నారు. అయితే ఫీల్డ్ అంపైర్ వచ్చి 11వ స్థానంలో బ్యాటింగ్కు రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయం కారణంగా ఆబ్సెంట్ హర్ట్ అయ్యాడని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ సమయంలోనే అష్రఫ్ కాలి గాయానికి గురవ్వడంతో బ్యాటింగ్కు రాలేదు. దీంతో టీమిండియా జట్టులో సంబరాలు షురూ అయ్యాయి.
మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (100), శుబ్మన్ గిల్ (126) శతకాలతో చెలరేగగా, సాయి సుదర్శన్ (81), పంత్ (81), సుందర్ (52) అర్థశతకాలతో ఆకట్టుకున్నారు. ఆఫ్గన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్లో అఫ్గానిస్తాన్ 152 పరుగులకే కుప్పకూలింది. రహమత్ షా (60) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో మానవ్ సుతార్ 6 వికెట్లతో చెలరేగగా, ప్రసిధ్ క్రిష్ణ 3 వికెట్లు తీశాడు. దీంతో ఫాలోఆన్ ఆడిన అఫ్గానిస్తాన్ 112 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. రెండు ఇన్నింగ్స్లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.


