లండన్: భారత పేస్ బౌలర్, హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత క్రికెట్ మేగజీన్ ‘విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్’ 2026 సంచిక కవర్ పేజీపై పబ్లిషర్లు సిరాజ్ చిత్రాన్ని ముద్రించారు. సిరాజ్తోపాటు ఇంగ్లండ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ ఫొటో కూడా దీనిపై ఉంది.
ఓవల్ టెస్టులో చేతితో గాయంతో జట్టును కాపాడేందుకు కట్టుతోనే మైదానానికి వచ్చిన వోక్స్ ఫొటోనే ఇక్కడ వాడారు. ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగియగా... చివరి టెస్టులో సిరాజ్ ప్రదర్శనతోనే భారత్ 6 పరుగుల తేడాతో నెగ్గింది.
రెండో ఇన్నింగ్స్లో చివరి రోజు 4 వికెట్లతో ఇంగ్లండ్ 35 పరుగులు చేయాల్సి ఉండగా, సిరాజ్ 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ ఆట ముగించాడు. మొత్తంగా ఈ సిరీస్లో సిరాజ్ 32.43 సగటుతో అత్యధికంగా 23 వికెట్లు పడగొట్టడం విశేషం. కొత్త విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ సంచిక ఏప్రిల్ 16న మార్కెట్లోకి రానుంది.


