టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఓ ఆటగాడు జట్టులోకి వస్తే మరో ప్లేయర్ దూరమవుతున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా వరల్డ్కప్ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. నమీబియాతో మ్యాచ్కు అతడు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
అదే విధంగా.. తీవ్రమైన జ్వరం కారణంగా టీ20 ప్రపంచకప్-2026 తొలి మ్యాచ్కు దూరమైన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా కోలుకున్నాడు. అమెరికాతో మ్యాచ్కు దూరంగా ఉన్న అతడు గురువారం నాటి మ్యాచ్ కోసం ఇప్పటికే సన్నద్ధమయ్యాడు.
ఆస్పత్రిపాలైన అభిషేక్ శర్మ
ఇలాంటి శుభ తరుణంలో టీమిండియాకు మరో చేదువార్త. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఆస్పత్రిపాలైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అభిషేక్ శర్మ కడుపు నొప్పితో పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్కు అభిషేక్ శర్మ దూరమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కటే కూడా ధ్రువీకరించాడు. ‘‘అభి ఇప్పటికీ ఉదర సంబంధిత నొప్పితో బాధపడుతున్నాడు. పూర్తిగా కోలుకుని మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడనే అనుకుంటున్నాం’’ అని తెలిపాడు.
అందుబాటులో ఉండకపోవచ్చు
అయితే, బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. సమస్య ఏమిటో కనుక్కునేందుకు పరీక్షలు జరుగుతున్నాయి. అతడు డిశ్చార్జ్ అవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. నమీబియాతో మ్యాచ్కు మాత్రం అతడు అందుబాటులో ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి.
కాగా అభిషేక్ శర్మ గనుక దూరమైతే అతడి స్థానంలో సంజూ శాంసన్ తిరిగి ఓపెనర్గా తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ విఫలం కావడంతో అతడి స్థానంలో అభిషేక్కు జోడీగా ఇషాన్ కిషన్ ఓపెనర్గా వచ్చాడు.
సంజూకు ఛాన్స్
ఇక అమెరికాతో తొలి మ్యాచ్లో గెలిచి బోణీ కొట్టిన టీమిండియా.. గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో తలపడుతుంది. కాగా అమెరికాతో మ్యాచ్లో అభిషేక్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిని విషయం తెలిసిందే. అయితే, ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన ఈ విధ్వంసకర ఓపెనర్ ఆట తీరును తప్పుపట్టాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలిచారు.


