అంతర్జాతీయ క్రికెట్లో సీనియర్ స్థాయిలో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో పేస్ బౌలర్ ఎహ్సాన్ ఆదిల్ కూడా చేరాడు. 32 ఏళ్ల ఆదిల్ 2013లో అరంగేట్రం చేసి పాకిస్తాన్ తరఫున 3 టెస్టులు, 6 వన్డేలు ఆడాడు. 2015 వన్డే వరల్డ్ కప్లో కూడా అతడు రెండు మ్యాచ్లలో బరిలోకి దిగాడు.
సొంత దేశంపైనే అరంగేట్రం
అయితే ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లిన అతను అక్కడ తన క్రికెట్ను కొనసాగించి జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అంతేకాదు అమెరికా టీ20 వరల్డ్ కప్-2026 జట్టులో చోటు దక్కించుకున్న ఆదిల్కు.. పాకిస్తాన్తో మంగళవారం జరిగిన మ్యాచే అమెరికా తరపున తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఇలా తన సొంత దేశం పాకిస్తాన్తో మ్యాచ్లోనే అమెరికా తరఫున అతడు అరంగేట్రం చేయడం విశేషం.
ప్రతీకారం తీర్చుకున్న పాక్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కొలంబోలో టాస్ గెలిచిన అమెరికా పాకిస్తాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. పాక్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
అయితే, లక్ష్య ఛేదనలో యూఎస్ఏ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 158 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా 32 పరుగుల తేడాతో గెలిచిన పాక్.. గత వరల్డ్కప్ ఎడిషన్లో అమెరికా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో ఆదిల్ 3 ఓవర్లలో 39 పరుగులిచ్చాడు.
ప్రపంచకప్ నుంచి హసరంగ, బ్రేస్వెల్ అవుట్
తాజా టీ20 ప్రపంచకప్లో దాదాపు అన్ని జట్లను గాయాల బెడద వేధిస్తోంది. తాజాగా శ్రీలంక, న్యూజిలాండ్లకు చెందిన హసరంగ, మైకేల్ బ్రేస్వెల్ మెగా ఈవెంట్కు దూరమయ్యారు. ఆదివారం ఐర్లాండ్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో శ్రీలంక ఆల్రౌండర్ హసరంగ తొడ కండరాల గాయానికి గురయ్యాడు.
దీంతో వరల్డ్కప్లో కొనసాగే అవకాశం లేకపోవడంతో అతని స్థానాన్ని లెగ్ స్పిన్నర్ హేమంతతో భర్తీ చేసుకునేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది. బ్రేస్వెల్ భారత పర్యటనకు వచ్చినపుడే గాయపడ్డాడు. అయితే వార్మప్ మ్యాచ్ సమయంలో అతని గాయం తిరగబెట్టింది. దీంతో అతని స్థానంలో ఆల్రౌండర్ కోల్ మెక్కొంచిని తీసుకున్నారు.


