ICC భయపడింది.. మాదే పైచేయి: బుద్ధి చూపించిన పాక్‌ | Pakistan No Longer Dependent On ICC: Ex PCB Chief T20 WC Claim | Sakshi
Sakshi News home page

ICC భయపడింది.. మాదే పైచేయి: బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!

Feb 11 2026 10:47 AM | Updated on Feb 11 2026 11:04 AM

Pakistan No Longer Dependent On ICC: Ex PCB Chief T20 WC Claim

భారత మాజీ క్రికెటర్లు ముందు నుంచి చెప్పినట్లుగానే పాకిస్తాన్‌ యూటర్న్‌ తీసుకుంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌ ఆడతామని ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) జోక్యంతో విధిలేని పరిస్థితుల్లో ఇందుకు అంగీకరించింది.

అయితే, కిందపడినా తమదే పైచేయి అన్నట్లుగా పాక్‌ ప్రగల్బాలు పలుకుతోంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) మాజీ చైర్మన్‌ నజామ్‌ సేథి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తమ ముందు ఐసీసీ చిన్నబోయిందని.. వెనక్కి తగ్గి తమతో రాజీకి వచ్చిందని అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐసీసీ భయపడింది.. అందుకే రాజీ
‘‘ఈ విషయంలో ఐసీసీ వెనకడుగు వేసింది. అందుకే పాక్‌ చెప్పినట్లుగా బంగ్లాదేశ్‌ పట్ల సానుకూలంగా స్పందించింది. పాకిస్తాన్‌ బంగ్లాకు మద్దతుగా గొప్ప నిర్ణయం తీసుకుంది. అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే.. భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తే తమపై ఐసీసీ ఆంక్షలు విధించలేదని తెలుసుకున్న పాక్‌ ఇంటాబయటా లాయర్లను స​ంప్రదించి బాయ్‌కాట్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

ఐసీసీకి కూడా తాము ఈ విషయంలో ఏమీ చేయలేమని తెలుసు. అందుకే ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా రంగంలోకి దిగారు. పాకిస్తాన్‌ భారత్‌తో మ్యాచ్‌ ఆడాలని కోరారు. అలా పాకిస్తాన్‌ వల్ల బంగ్లాదేశ్‌కు కూడా న్యాయం జరిగింది.

ఐసీసీ మీద ఆధాపడే స్థితిలో లేము
మిగతా అన్ని బోర్డుల మాదిరే గతంలో పాక్‌ కూడా ఐసీసీ మీద ఆధారపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం కంటే ఈ లీగ్‌ నుంచే ఎక్కువ డబ్బు వస్తోంది. కాబట్టి పాక్‌ తన సొంత వనరులపైనే ఆధారపడుతోంది.

కాబట్టి ఐసీసీ చెప్పినట్లు వినాల్సిన పనిలేదు. మార్చిలో పాకిస్తాన్‌కు అనుకూలంగా మరిన్ని నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది’’ అని నజామ్‌ సేథి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా పాకిస్తాన్‌కు ప్రధానంగా ఆదాయం ఐసీసీ నుంచే వస్తోంది.

అన్నివైపులా ఒత్తిడి 
అంతేకాదు.. పీఎస్‌ఎల్‌లో అంతర్జాతీయ క్రికెటర్లు ఆడాలన్నా ఆయా సభ్య దేశాల బోర్డుల అనుమతి తప్పనిసరి. ఒకవేళ పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తే.. సభ్య దేశాలు పాక్‌ లీగ్‌లో ఆడే క్రికెటర్లకు నో ఆబ్జక్షన్‌ లెటర్‌ ఇవ్వకుండా ఆపే అవకాశం ఉందని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.

అదే విధంగా.. శ్రీలంక క్రికెట్‌ బోర్డు సైతం పాక్‌లో తమపై జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేస్తూ లేఖ రాసింది. అయినా సరే తాము పాక్‌తో క్రికెట్‌ సంబంధాలు కొనసాగిస్తున్న తీరును ప్రస్తావించింది. యూఏఈ, బంగ్లాదేశ్‌ కూడా పాకిస్తాన్‌కు భారత్‌తో ఆడాలని విజ్ఞప్తి చేశాయి. అన్నింటికీ మించి గత్యంతరం లేకే భారత్‌తో ఆడలేమని పాక్‌ లేవనెత్తిన అంశం సబబుగా లేదు కాబట్టి.. ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమించే పరిస్థితి వచ్చింది.

మొదటికే మోసం వస్తుందనే భయం
ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గిన పాక్‌.. అయినా సరే తామే గొప్ప అంటూ ఇలా  మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకుంది. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్‌ కోసం తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసింది ఐసీసీ. అయితే, బంగ్లాదేశ్‌ కూడా తాము భారత్‌లో కాకుండా శ్రీలంకలో ఆడతామని పట్టుబట్టింది.

ఇందుకు ఐసీసీ నిరాకరించగా.. తాము టోర్నీలో ఆడలేమని బంగ్లాదేశ్‌ తప్పుకొంది. దీంతో మధ్యలోకి వచ్చిన పాక్‌.. తాము కూడా బంగ్లాకు మద్దతుగా టోర్నీ ఆడమని తొలుత సంకేతాలు ఇచ్చి బెదిరింపులకు దిగింది. ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందనే ఉద్దేశంతో భారత్‌తో మ్యాచ్‌ మాత్రమే ఆడమని నాటకాలు ఆడింది.

అయితే, ఈ మ్యాచ్‌ జరుగకపోతే సభ్య దేశాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున ఐసీసీ పాక్‌కు మరో అవకాశం ఇచ్చింది. లాహోర్‌లో పీసీబీతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పాక్‌ గొంతెమ్మ కోరికలను తిరస్కరించిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ విషయంలో తాము ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా ఆంక్షలు, పెనాల్టీలు విధించబోమని ప్రకటించింది.

చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్‌!.. ఈసారి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement