సరబ్‌జోత్‌కు కాంస్య పతకంం  | Sakshi
Sakshi News home page

సరబ్‌జోత్‌కు కాంస్య పతకంం 

Published Wed, Oct 25 2023 2:08 AM

Bronze medal for Sarabjot - Sakshi

చాంగ్వాన్‌ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ పతకాల బోణీ చేసింది. మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌ కాంస్య పతకం సాధించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సరబ్‌జోత్‌ 221.1 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. సరబ్‌జోత్‌ కాంస్య పతక ప్రదర్శనతో భారత్‌కు షూటింగ్‌ క్రీడాంశంలో ఎనిమిదో ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారైంది.

అంతకుముందు క్వాలిఫయింగ్‌ సరబ్‌జోత్‌ 581 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇప్పటి వరకు భారత్‌ నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌కు రుద్రాం„  పాటిల్‌ (పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), స్వప్నిల్, అఖిల్‌ షెరాన్‌ (పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌), భౌనీష్‌ మెండిరట్టా (పురుషుల ట్రాప్‌), మెహులీ ఘోష్‌ (మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), సిఫ్ట్‌ కౌర్‌ (మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌), రాజేశ్వరి కుమారి (మహిళల ట్రాప్‌) అర్హత పొందారు.

మరోవైపు మహిళల జూనియర్‌ విభాగం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన సంయమ్‌ 240.6 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.   

Advertisement
Advertisement