
లాహోర్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. లౌరా డెలానీ (75 బంతుల్లో 63; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా... ప్రెండర్గాస్ట్ (41), అమీ హంటర్ (33) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రాబియా ఖాన్ 3, ఫహిమా ఖాతూన్ 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ మహిళల జట్టు 48.4 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఒకదశలో బంగ్లాదేశ్ 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే రీతూ మోనీ (61 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) లోయర్ ఆర్డర్ బ్యాటర్ల సహకారంతో బంగ్లాదేశ్ను విజయతీరానికి చేర్చింది. అంతకుముందు కెప్టెన్ నిగార్ సుల్తానా (68 బంతుల్లో 51; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకుంది.
ఐర్లాండ్ బౌలర్లలో ప్రెండర్గాస్ట్, అర్లీనా కెల్లి చెరో 2 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన బంగ్లాదేశ్ 4 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానికి చేరింది. తదుపరి మ్యాచ్లో మంగళవారం స్కాట్లాండ్తో బంగ్లాదేశ్ తలపడుతుంది.
స్కాట్లాండ్ రెండో విజయం
మరోవైపు స్కాట్లాండ్ జట్టు కూడా రెండో విజయం సాధించింది. థాయ్లాండ్తో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ 58 పరుగుల తేడాతో గెలిచింది. మొదట స్కాట్లాండ్ 41 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ క్యాథరిన్ బ్రైస్ (58 బంతుల్లో 60; 7 ఫోర్లు), మేగన్ మెక్కాల్ (60 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు.
అలీసా లిస్టర్ (38; 6 ఫోర్లు) రాణించింది. అనంతరం లక్ష్యఛేదనలో థాయ్లాండ్ జట్టు 31.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఈ టోర్నమెంట్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధిస్తాయి.