WTC Final: ఆసీస్‌కు అక్కడ అంత సీన్‌ లేదు.. గెలుపు టీమిండియాదే..!

Australia Has Lowest Success Rate In Oval - Sakshi

భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మ‌ధ్య వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డ‌బ్ల్యూటీసీ) 2021-23 ఫైన‌ల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు సౌత్‌ లండన్‌లోని ఓవ‌ల్‌ మైదానం వేదిక‌గా జ‌రుగ‌నున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలతో పాటు ఇతర రికార్డుల విషయంలో ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ.. ఓ విషయం మాత్రం ఆసీస్‌ను తెగ కలవరపెడుతుంది.

అదేంటంటే.. ఇంగ్లండ్‌లోని మొత్తం వేదికల్లో ఓవ‌ల్ మైదానంలోనే ఆస్ట్రేలియాకు అతి తక్కువ స‌క్సెస్‌రేట్ ఉండ‌టం. 1880లో జరిగిన ఇనాగురల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ నుంచి ఈ వేదికపై ఆసీస్‌ ఆడిన 38 మ్యాచ్‌ల్లో కేవలం ఏడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఆ జట్టు విన్నింగ్‌ రేటియో ఈ మైదానంలో 18.42గా ఉంది. ఇంగ్లండ్‌ మొత్తంలో ఆసీస్‌ ఈ మైదానంలోనే అతి స్వల్ప సక్సెస్‌ రేట్‌ కలిగి ఉంది. గడిచిన 50 ఏళ్లలో ఓవల్‌లో ఆస్ట్రేలియా కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. ఆసీస్‌కు ఇంగ్లండ్‌లో అత్యధికంగా లార్డ్స్‌లో అత్యధిక స‌క్సెస్ రేట్‌ (39.72) ఉంది.

మరోవైపు టీమిండియాకు సైతం ఓవల్‌లో పెద్ద మెరుగైన రికార్డు ఏమీ లేదు. భారత జట్టు ఇక్కడ ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే మాత్రమే విజ‌యం సాధించింది. భారత్‌.. చివ‌రిసారిగా ఇక్కడ 2021లో గెలుపొందింది. నాటి మ్యాచ్‌లో భారత్‌.. 157 ప‌రుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. 

రికార్డుల విషయం పక్కన పెడితే.. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడేందుకు భారత్‌, ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు ఇదివరకే లండన్‌కు చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొందేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. గెలుపుపై ఇరు జట్లు ధీమాగా ఉన్నప్పటికీ.. ఆసీస్‌తో పోలిస్తే టీమిండియాకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. గిల్‌, కోహ్లి, షమీ సూపర్‌ ఫామ్‌లో ఉండటం టీమిండియా అదనంగా కలిసొచ్చే అంశం.

చదవండి: ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్‌ బోర్డు.. జెర్సీ స్పాన్సర్‌ చేసే నాథుడే లేడా..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top