
Photo Courtesy: BCCI/IPL
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. పేరుకే జట్టులో ‘విధ్వంసకర బ్యాటర్లు’ ఉన్నారని.. కానీ వారి వల్ల ప్రేక్షకులకు ఎలాంటి వినోదం లభించడం లేదని పేర్కొన్నాడు. బౌలర్లకు అంతగా సహకరించని ఈడెన్ గార్డెన్స్ పిచ్పై కూడా పరుగులు చేయలేక.. చేతులెత్తేయడం వారి పేలవ ప్రదర్శనకు నిదర్శనమని పేర్కొన్నాడు.
ఐపీఎల్-2024లో అద్భుత బ్యాటింగ్తో ఫైనల్ వరకు చేరుకున్న సన్రైజర్స్.. టైటిల్ పోరులో మాత్రం 113 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బౌలింగ్లోనూ విఫలమై.. తద్వారా రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)ని ఘనంగా ఆరంభించినప్పటికీ హ్యాట్రిక్ పరాజయాలతో చతికిల పడింది.
ఒక్కరూ నిలబడలేదు
తాజాగా కోల్కతా నైట్ రైడర్స్తో గురువారం నాటి మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో ఫోర్తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్ ట్రవిస్ హెడ్ (Travis Head) మరుసటి బంతికే అవుట్ కాగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 2, వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 2 పరుగులకే పెవిలియన్ చేరారు.
ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి (19) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలం కాగా.. భాగస్వామ్యం నెలకొల్పుతారనుకున్న కమిందు మెండిస్ (27), హెన్రిచ్ క్లాసెన్ (33) కూడా నిరాశపరిచారు. మెరుపు బ్యాటింగ్తో అలరిస్తున్నాడనుకున్న అనికేత్ వర్మ (6) కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఫలితంగా 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే సన్రైజర్స్ ఆలౌట్ అయింది.
80 పరుగుల తేడాతో ఓటమి
అంతకు ముందు ఇదే పిచ్పై చక్కటి షాట్లు ఆడుతూ కేకేఆర్ బ్యాటర్లు 200 పరుగులు స్కోరు చేశారు. అయితే, ఈ టార్గెట్ను ఎస్ఆర్హెచ్ సులువుగానే ఛేజ్ చేస్తుందనుకుంటే.. 120 పరుగులకే కుప్పకూలి.. 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రైజర్స్ బ్యాటర్లలో మెజారిటీ మంది సులువైన క్యాచ్లు ఇచ్చి పెవిలియన్ చేరడం గమనార్హం.
ఈ నేపథ్యంలో కేకేఆర్- సన్రైజర్స్ ఫలితంపై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్ హైదరాబాద్ జట్టు తీరుపై ఘాటు విమర్శలు చేశాడు. ‘‘ఒకప్పుడు పంజాబ్ జట్టుకు ఇలాంటి పేరుండేది. ముందు నుంచి రాణించడం ఆఖర్లో చేతులెత్తేయడం.. ఇప్పుడు సన్రైజర్స్ పరిస్థితి అలాగే కనిపిస్తోంది.
కేకేఆర్ బౌలింగ్ అంత గొప్పగా ఏమీ లేదు.. కానీ
వాళ్లు 190 పరుగులు చేసి ఓడిపోయారు.. 160 రన్స్ చేసి ఓడిపోయారు. ఇప్పుడేమో 200 పరుగులు ఛేదించే క్రమంలో 120 పరుగులకే ఆలౌట్ అయ్యారు. నిజానికి కేకేఆర్ బౌలింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. బంతి కూడా టర్న్ కావడం లేదు. ఇదే పిచ్పై వాళ్ల బ్యాటర్లు 200 పరుగులు సాధించారు.
అంతేకాదు రెండో ఇన్నింగ్స్లో బౌలర్లకు పిచ్ నుంచి అంతగా సహకారం కూడా అందలేదు. వికెట్ కాస్త స్లోగా ఉంది. అందుకే వాళ్లు ఎక్కువగా స్లో బాల్స్ వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటర్ క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త ఓపికగా ఎదురుచూడాలి. పరిస్థితులకు అలవాటుపడిన తర్వాత పరుగుల వేట మొదలుపెట్టాలి.
కానీ ఈరోజు వాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. జట్టులో ఎంతో మంది బ్యాటర్లు ఉన్నారు. కానీ ఏం లాభం అవసరమైనపుడు ఒక్కరూ పరుగులు చేయలేకపోయారు. 120 పరుగులకే ఆలౌట్ అయ్యారు. జనాలు డబ్బు ఇచ్చి మరీ మీ ఆటను చూడటానికి వస్తారు.
ఈసారి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరిగినా చాలా మంది సన్రైజర్స్ బ్యాటింగ్ చూసేందుకు వచ్చారనడం అతిశయోక్తి కాదు. కానీ మీరు వారందరినీ నిరాశకు గురిచేశారు’’ అని సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు.
ఐపీఎల్-2025: కేకేఆర్ వర్సెస్ సన్రైజర్స్
👉కేకేఆర్ స్కోరు: 200/6 (20)
👉సన్రైజర్స్ స్కోరు: 120 (16.4)
👉ఫలితం: 80 పరుగుల తేడాతో సన్రైజర్స్పై కేకేఆర్ గెలుపు.
చదవండి: రూ. 20 లక్షలు.. రూ. 20 కోట్లు.. ఏదైనా ఒకటే.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్లో స్కోరు చేయాలా?