PC: BCCI X
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ స్థానిక టీ20 లీగ్లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గిల్తో పాటు టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్.. అదే విధంగా రమణ్దీప్ సింగ్ ఈ లీగ్లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) ... షేర్-ఈ-పంజాబ్ పేరిట తమ సొంత టీ20 లీగ్ను నిర్వహించనున్నట్లు ఆదివారం ప్రకటించింది. స్థానిక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చండీగఢ్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ పాల్గొన్నాడు.
ఇదొక చక్కటి ప్లాట్ఫామ్
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘యువ ఆటగాళ్లను తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదొక చక్కటి ప్లాట్ఫామ్. క్రమంగా పంజాబ్ జట్టు, టీమిండియా స్థాయికి ఎదిగేందుకు షేర్-ఈ-పంజాబ్ దోహదం చేస్తుంది. పంజాబ్ ఎల్లప్పుడూ టీమిండియాకు అత్యుత్తమ క్రికెటర్లను అందించింది.
ఈ లీగ్ ద్వారా కూడా మరెంతో మంది వెలుగులోకి వస్తారని నమ్ముతున్నాను. మా గ్రామంలో నాన్న క్రికెట్ అకాడమీ నిర్వహించేవారు. అక్కడ ఉచితంగానే కోచింగ్ ఇచ్చేవాళ్లము. ఇప్పటికీ మా నాన్నకి కాస్త సమయం దొరికితే అక్కడికి వెళ్లి పిల్లల ఆటను గమనిస్తారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అలాంటిది’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు.
గిల్, బ్రార్ ఆలస్యంగానైనా..
కాగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 13 మధ్య షేర్-ఈ-పంజాబ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్ తదితరులు ఈ లీగ్కు అందుబాటులో ఉన్నప్పటికీ.. శుబ్మన్ గిల్, గుర్నూర్ బ్రార్ మాత్రం కాస్త ఆలస్యంగా తమ జట్లతో చేరే అవకాశం ఉంది.
వీరిద్దరు ఆగష్టు 15- 28 వరకు శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్తో బిజీగా ఉండనున్నారు. ఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ లీగ్ ఆరంభ ఎడిషన్లో ఆరుజట్లు పాల్గొననున్నాయి. అమృత్సర్, ఫజిల్క, జలంధర్, లుథియానా, మొహాలీ, భటిండా టైటిల్ కోసం పోటీపడనున్నాయి.


