విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ..
తృటిలో తప్పిన ప్రమాదం
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటలో సోమవారం గడ్డి లోడ్తో వెళ్తున్న లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వివరాలు ఇలా.. మెదక్– బొడ్మట్పల్లి నుంచి గడ్డి లోడ్తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి వేగంగా వెళ్లి కల్యాణ మంటపం పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగి పోయింది. పక్కనే నివాసం ఉన్న కుటుంబీకులకు కొద్దిలో ప్రమా దం తప్పింది. వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు సరఫరాను నిలిపివేశారు. అనంతరం నూతన స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
రోడ్డు ప్రమాదంలో
చిరు వ్యాపారి మృతి
గజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో చిరు వ్యాపారి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... శ్రీగిరిపల్లికి చెందిన పెద్దల కిష్టయ్య(54) ప్రజ్ఞాపూర్ శివారులోని రాజీవ్ రహదారిపై మొక్కజొన్న కంకులను విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దినచర్యలో భాగంగా పాతూరు మార్కెట్లో మొక్కజొన్న కంకులను కొనుగోలు చేసేందుకు శ్రీగిరిపల్లి నుంచి తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ శివారులోని రాణే పరిశ్రమ సమీపంలో టీవీఎస్ ఎక్సెల్పై వెళ్తున్న కిష్టయ్యను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా రోడ్డు పక్కన నిలిపి ఉన్న మరో కారును ఢీకొట్టింది. కిష్టయ్యను అంబులెన్స్లో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నీటి తొట్టిలో పడి బాలుడు
సంగారెడ్డి: మూడేళ్ల బాలుడు నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, చౌటకూరు మండలం శివంపేట గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన నయీం కుమారుడు మహమ్మద్ ఫైజల్ (3) ఇంటి సమీపంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడిపోయాడు. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబీకులు వెతకారు. ఈ క్రమంలో నీటి తొట్టిలో పడిన విషయాన్ని గమనించి వెంటనే బాలుడిని సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. కాగా బాలుడు తండ్రి నయీం గతంలో అనారోగ్యంతో మృతి చెందాడు.
సైకో కిల్లర్కు యావజ్జీవ ఖైదు
రూ.60 వేల జరిమాన
చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలో వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్కు రెండు హత్యకేసుల్లో యావజ్జీవ ఖైదుతో పాటు రూ.60 వేల జరిమాన విధిస్తూ మెదక్ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్పీ శ్రీనివాస్రావు కథనం మేరకు... మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన మల్లేశం 2024 అక్టోబర్లో ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో నవీన్ అనే వ్యక్తితో కలిసి మద్యం తాగిన అనంతరం బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం వారం రోజుల్లో నిజామాబాద్కు చెందిన స్వామితో స్నేహం చేసి చిన్నశంకరంపేటకు తీసుకువచ్చాడు. మద్యం తాగిన అనంతరం మత్తులోకి జారుకోగానే బండరాయితో తలపై మోది హత్య చేశాడు. రెండు ఘటనల్లో మృతదేహంపై చెత్తకాగితాలు వేసి నిప్పుపెట్టాడు. కాగా ఎస్ఐ నారాయణగౌడ్, రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్ నిందితుడిని పట్టుకున్నారు. ఆధారాలతో కూడిన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ..


