గింజ కొంటే ఒట్టు.. | - | Sakshi
Sakshi News home page

గింజ కొంటే ఒట్టు..

Nov 6 2024 6:35 AM | Updated on Nov 6 2024 12:31 PM

దేవులపల్లి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి

దేవులపల్లి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి

తేమ పేరుతో సేకరణలో తీవ్ర జాప్యం

కేంద్రాలు ప్రారంభించి పక్షంరోజులు దాటుతున్నా.. 

చాలా కేంద్రాల్లో షురూ కానీ కాంటాలు 

అన్నదాతను వెంటాడుతున్నఅకాల వర్షాలు

ఈ చిత్రంలో కనిపిస్తున్నది.. హత్నూర మండలం దేవులపల్లి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి. ఈ కేంద్రాన్ని ప్రారంభించి పక్షం రోజులు దాటుతున్నప్పటికీ ఇంకా తూకాలు ప్రారంభించలేదు. దీంతో ఈ కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన సుమారు 60 మంది రైతులు ఎప్పుడెప్పుడు కాంటాలు షురూ చేస్తారా..? అని ఎదురు చూస్తున్నారు.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ధాన్యం సేకరణ పట్టాలెక్కడం లేదు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కాంటాలు ప్రారంభ ం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల పక్షం రోజుల క్రితం ఎంతో ఆర్భాటంగా కేంద్రాలను ప్రారంభించారు. కానీ వివిధ కారణాలతో తూకాలు వేయడం లేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈవానాకాలం కొనుగోలు సీజన్‌లో జిల్లాలో సుమారు 2.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది. 183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కనీసం 30 కేంద్రాల్లో కూడా కాంటాలు ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు కేవలం 250 మెట్రిక్‌ టన్నులలోపే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

తేమ పేరుతో జాప్యం..

ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ధాన్యాన్ని తూకం వేయడం లేదు. నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ శాతం 17లోపు ఉండాలి. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవడంతో తేమ శాతం ఎక్కువ చూపుతోంది. దీంతో గత నాలుగు రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టిన రైతుల ధాన్యాన్ని కూడా తూకం వేయడం లేదు. మాయిశ్చర్‌ మీటర్‌తో చూస్తే తేమ 19 నుంచి 21 శాతం వరకు వస్తోందని కేంద్రం నిర్వాహకులు సాకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement