ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా సీఎం జగన్‌ను మిల్లీమీటర్ కూడా కదపలేరు

YSRCP Perni Nani Fires On TDP Chandrababu Lokesh - Sakshi

తాడేపల్లి: టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ప్రాయోజిత కార్యక్రమం అన్నారు పేర్ని నాని. నందమూరి వారసులను చూసి చంద్రబాబా భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కుప్పం సభలో లోకేష్ బరితెగించి అబద్దాలు మాట్లాడాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు మంచి పనులు చేస్తే లోకేష్ ఎందుకు బజారున పడ్డారని ప్రశ్నించారు. తెలుగుదేశాన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు.

చంద్రబాబు చెత్తనాయకుడని అ‍చ్చన్నాయుడే చెబుతున్నాడని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పెన్షన్లు తీసేశారంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 40 లక్షల పెన్షన్లు వస్తే.. సీఎం వైఎస్ జగన్ 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు.

కొత్త వైన్ బ్రాండులన్నీ చంద్రబాబు హయాంలో వచ్చినవేనని పేర్ని గుర్తు చేశారు. చంద్రబాబు పెట్టిన ధాన్యం బకాయిలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. చంద్రబాబు పెట్టిన 22వేల కోట్ల కరెంటు బకాయిల భారాన్ని ప్రజలు మోస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు 100 అబద్దాలు చెబితే లోకేష్ 1000 చెబుతున్నారని విమర్శించారు.

జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పే దమ్ము టీడీపీకి ఉందా? అని పేర్ని సవాల్ విసిరారు. తెలుగు గంగను పూర్తి చేస్తామని చెప్పడానికి సిగ్గు లేదా? అని ఫైర్ అయ్యారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. టీడీపీ నేతలు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా సీఎం జగన్‌ను మిల్లీమీటర్ కూడా కదపలేరని పేర్ని వ్యాఖ్యానించారు.

చదవండి: పప్పు సుద్ద లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీనుందా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top