సాక్షి, విజయవాడ: అమరావతి రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు నివసించే చోటే లేకుండా వెన్నుపోటు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు కనీసం ఒక్క ఇంటి స్థలం కూడా కేటాయించలేదని, కేంద్ర ప్రభుత్వానికి కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదని పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు వెల్లడయ్యాయని విమర్శించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 51 వేల మంది పేద మహిళల పేరిట 1,400 ఎకరాల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు చేయిస్తే, వెన్నుపోటు కూటమి ప్రభుత్వం రాగానే ఆ ఇళ్లను, స్థలాలను రద్దు చేసి పేదల కళ్లలో నీళ్లు తెప్పించారని మండిపడ్డారు. అమరావతిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, స్వంత మనుషులకు, బినామీలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని దేవినేని అవినాశ్ ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
వైఎస్ జగన్ ఇచ్చిన 51 వేల ఇళ్ల పట్టాలు రద్దు చేశారు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ద్వారా ఈ కూటమి ప్రభుత్వ నైజం బయటపడింది. 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY - అర్బన్ 2.0)' కింద ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది ఇళ్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ, అమరావతి ప్రాంతంలో నివసించే పేదల కోసం ప్రభుత్వం ఒక్క ఇల్లు లేదా స్థలం ప్రతిపాదన కూడా పంపలేదు. జూన్ 2026 నాటికి 107 పట్టణాల్లో 12 వేల ఇళ్లకు ఆమోదం లభిస్తే, అమరావతిలో ఒక్క పేద కుటుంబానికి కూడా ఇల్లు కేటాయించకపోవడం దారుణం.
అమరావతి అందరిదీ, ప్రపంచ రాజధాని అని గొప్పలు చెప్పే చంద్రబాబు.. అక్కడ పేదవాళ్లు నివసించడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? గతంలో వైఎస్ జగన్ హయాంలో సీఆర్డీఏ చట్టం సెక్షన్ 53(1)(డి) ప్రకారం 5 శాతం భూమిని పేదలకు కేటాయించి.. 51 వేల మంది మహిళల పేరిట 1,400 ఎకరాల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు చేయించాం. కానీ మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను, స్థలాలను రద్దు చేసి పేదల కళ్లలో నీళ్లు తెప్పించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బినామీల కోసమే తపన
రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ చంద్రబాబు.. అమరావతిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, తన సొంత మనుషులకు, బినామీలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. 'మావిగన్' (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు-తెనాలి) అర్బన్ కారిడార్ అభివృద్ధిపై వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతిపాదనతో షాక్కు గురైన చంద్రబాబు, చివరకు అమరావతి అంటే 29 గ్రామాలు మాత్రమే కాదని, విజయవాడ-గుంటూరు కూడా అమరావతిలో భాగమేనంటూ ఒప్పుకోక తప్పలేదు. అమరావతి కోసం తెచ్చిన రూ.47 వేల కోట్ల అప్పులకు, అసలు-వడ్డీలు కట్టడానికి ప్రజల ఖజానా సొమ్మునే వాడుతూ, సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని ప్రజలను మోసం చేస్తున్నారు.
చంద్రబాబు, మీరందరూ వైఎస్ జగన్ పాలనా అనుభవాన్ని చూసి నేర్చుకోవాలి. ఆయన ప్రతిపాదించి శంకుస్థాపన చేసిన భోగాపురం ఎయిర్పోర్టులో ప్రతి ఇటుకపైనా వైఎస్ జగన్ పేరే ఉంటుంది. అమరావతిలో ఇళ్లు రద్దు చేసిన ఆ 50 వేల మంది మహిళలకు, పేదలకు ఈ కూటమి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని దేవినేని అవినాశ్ హెచ్చరించారు.


