తాడేపల్లి: వెన్నుపోటు కూటమి అసత్య ప్రచారాలను భూస్థాపితం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 1వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాయీ బ్రాహ్మణులతో సమావేశం నిర్వహించారు సజ్జల. ఈ కార్యక్రమానికి నాయీ బ్రాహ్మణ విభాగం నేతలతో పాటు ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు హాజరయ్యారు.
దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘నాయీ బ్రాహ్మణులను రాజకీయంగా ప్రోత్సహించింది జగనే. వెన్నుపోటు కూటమి అసత్య ప్రచారాలను భూస్థాపితం చేయాలి. వైఎస్సార్సీపీ కమిటీల్లో 10 వేల మంది నాయీ బ్రాహ్మణులకు స్థానం. పార్టీ నిర్మాణంలో బీసీలకు 60 శాతానికి పైగా ప్రాతినిధ్యం.జగన్ హయాంలో 15–20 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమం అందింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.3 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టింది.
అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్నారు. డీఎస్సీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూటమి అబద్ధాలను తిప్పికొట్టాలి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తులో మరిన్ని పదవులుంటాయి. 2029లో జగన్ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యంగా పని చేయాలి.
టీటీడీ బోర్డులో నాయీ బ్రాహ్మణులకు జగనే అవకాశం కల్పించారు. దేవాలయ పాలక మండళ్లలో నాయీ బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించిందీ జగనే. దేవాలయాల్లో ఉద్యోగులుగా గుర్తింపు, రూ.20 వేల జీతం ఖరారు చేశాం. ప్రతి షాపుకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. కరోనా సమయంలో ఒక్క బటన్తో రూ.50 కోట్ల సాయం చేశాం. నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్తో పాటు కీలక పదవులు ఇచ్చిన ఘనత జగన్దే. జగన్ చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని స్పష్టం చేశారు.


