సాక్షి, గుంటూరు: గుంటూరులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. లాడ్జి సెంటర్లో అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి సర్కార్ వచ్చి రెండేళ్లయింది.. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదని మండిపడ్డారు.
‘‘సూపర్ సిక్స్లో ముఖ్యమైనవి అసలు అమలు చేయలేదు. స్త్రీ నిధి ఇవ్వలేదు. ప్రధాన వాగ్ధానాన్ని వదిలేశారు. నిరుద్యోగి భృతి ఇవ్వలేదు. యువగళం గాలికి పోయింది. యాభై ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ అన్నారు. ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వం ఇది. చంద్రబాబు ప్రపంచ మోసగాడు. లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు.. పవన్ కల్యాణ్ ఆంధ్రా మోసగాడు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.
డీఎస్సీపై మాట్లాడటం లేదు. లోకేష్ డీఎస్సీలో ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నాడు. చంద్రబాబ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే డీఎస్పీ అడ్డుకున్నారు. తెలుగుదేశం నాయకులు వైఎస్ జగన్ దిష్టి బొమ్మ తగులపెడితే పోలీసులు రక్షణ కల్పిస్తారు. గుంటూరు పోలీసులకు ఏం పోయేకాలం?. రాబోయేది జగన్ పాలనే. వచ్చే నెల 29 తేదీన వినతి పాదయాత్ర చేస్తాను’’ అని అంబటి రాంబాబు వెల్లడించారు.


