సాక్షి, కాకినాడ జిల్లా: రెడ్ బుక్ రాజ్యాంగం నిజ స్వరూపం బయటపడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులను విచ్చలవిడిగా చేతిలో అస్త్రంలా టీడీపీ వాడుకొంటోంది. విజయవాడ లాకప్ డెత్ ఘటన.. చట్టాలు, మానవ హక్కులు లేవని చెప్పింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ మాట్లాడితే కులం రంగు పులుముతున్నారని ఆయన మండిపడ్డారు.
‘‘లాకప్ డెత్ మానవ హక్కులకు సంబంధించిన విషయం. దీంట్లో కులాల్ని, మతాలను తీసుకువచ్చి ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా సొంత మీడియా రంగంలోకి వచ్చేసింది. లాకప్ డెత్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ను ఇరికించాలని వైఎస్ జగన్ మాకు ఆదేశించినట్లు.. దానికి పర్యవేక్షణ బాధ్యత నాకు ఇచ్చినట్లుగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. పవన్ను ఇరికించాలని వైఎస్ జగన్ ఎందుకు అంటారు?. వైఎస్సార్సీపీకి ఏం సంబంధం?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసే హోం మంత్రి, ముఖ్యమంత్రి లాకప్ డెత్ ఘటనకు బాధ్యులు. వీరితో పాటుగా డీజీపీ, సీపీ, ఏసీపీ, సీఐ, ఇతర స్టాప్ బాధ్యులు. చంపేసి బూడిద చేయడం పోలీసుల పరాకాష్ట. లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ను ఆమోదించాలి. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారన్న వాస్తవం లాకప్ డెత్ కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. చట్టాన్ని అమలు చేయాలనే గౌరవం, భయం పోలీసులకు పోయింది’’ అని కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.


