హైదరాబాద్: రాజమండ్రిలో ఇటీవల ఇద్దరు ఉన్మాదులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు ప్రకటించారు. ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కొన్ని గంటల క్రితం ప్రకటించిన వైద్యులు.. అంతలోనే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్దారించారు.
ప్రియాంక కేసు ఇదే..
ప్రియాంక కర్నూలుకు చెందిన యువతి. ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్ కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి బైక్ను ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది.
ప్రియాంకను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఇటీవల మాట్లాడుతూ... కొన్ని రోజుల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని వైద్యురాలిగా సేవలు అందిస్తుందని అనుకున్నామని ఆవేదన చెందారు. తమ కుమార్తెకు ఈ గతి పట్టించిన వాళ్లను వదలిపెట్టకూడదని అన్నారు.


