YSRCP: 11 నియోజకవర్గాల ఇంఛార్జిల మార్పు | YSRCP Changed 11 Constituencies In-Charges | Sakshi
Sakshi News home page

వైనాట్‌ 175.. 11 నియోజకవర్గాల ఇంఛార్జిలను మార్చిన వైఎస్సార్‌సీపీ

Dec 11 2023 8:23 PM | Updated on Dec 14 2023 11:01 AM

YSRCP Changed 11 Constituencies in charges - Sakshi

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రణాళిక సిద్దం చేస్తోంది

సాక్షి, గుంటూరు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్‌సీపీ ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో.. పలు నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జిలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను సోమవారం సాయంత్రం సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద మీడియాకు తెలియజేశారు. పదకొండు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జీలను నియమించినట్లు తెలిపారాయన. స్థాన చలనం జాబితాలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు.

గుంటూరు పశ్చిమ- విడదల రజిని, మంగళగిరి-గంజి చిరంజీవి,  పత్తిపాడు-బాలసాని కిషోర్‌ కుమార్‌, వేమూరు- అశోక్‌బాబు, సంతనూతలపాడు -మేరుగ నాగార్జున, తాడికొండ-మేకతోటి సుచరిత, కొండెపి -ఆదిమూలపు సురేష్‌, చిలకలూరిపేట- రాజేష్‌ నాయుడు, అద్దంకి -పాణెం హనిమిరెడ్డి, రేపల్లె -ఈవూరు గణేష్‌, గాజువాక-వరికూటి రామచంద్రరావులను నియమించినట్లు తెలిపారు. 


‘‘రేపటి నుండి పార్టీ వ్యవహారాలను వీరంతా పర్యవేక్షిస్తారు.  పార్టీ ఎవరినీ వదులుకోదు.  అందరి సేవలనూ వినియోగించుకుంటాం. 175కి 175 సీట్లు సాధించాలనే లక్ష్యంతో పని చేస్తాం. అణగారినవారికి ధైర్యం ఇచ్చి పని చేస్తున్నాం.  ఏదో మాటలు చెప్పి చేయటం లేదు. ఏపీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే ప్రతిపాదికన ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని బొత్స పేర్కొన్నారు.

 

భవిష్యత్తులో ఇంకా..
ఈ మార్పుతో 2024 ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల తెలిపారు. నేతల గెలుపు అవకాశాల్ని బట్టి ఇంఛార్జిలను మార్చామని స్పష్టత ఇచ్చారు. ‘అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించాలి. అందుకోసమే  సీఎం జగన్‌ ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది. భవిష్యత్తులో కూడా అవసరాన్ని మార్పులు ఉంటాయ’ని సజ్జల ఈసందర్భంగా వ్యాఖ్యానించారు.

‘‘పార్టీ పుట్టినప్పటి నుండి ప్రజల కోసమే పనిచేస్తున్నాం. అది మా బాధ్యతగా చూస్తున్నాం. పార్టీకి ఎవరు ఎక్కడ అవసరమో అక్కడ వారిని నియమిస్తున్నాం. అధికారంలోకి రావాలంటే సమీక్షలు అవసరం. సీఎం జగన్‌ చాలా ఓపెన్‌గా ముందునుండే చెప్తున్నారు. అన్నీ శాస్త్రీయంగా పరిశీలించాకనే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మార్చిన ఈ 11 మంది గెలవరని కాదు.. ఇంకా మెజారిటీతో గెలవాలన్నదే మా ఆలోచన. ప్రతిపక్షానికి ఒక దారీతెన్నూ లేకుండా పోతోంది. ఎక్కడ ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి వారిది. కానీ మా(వైఎస్సార్‌సీపీ) పార్టీలో అన్నీ చర్చించే నిర్ణయం తీసుకుంటాం’’ అని సజ్జల పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement