గుడివాడ ఎస్ఐని వీఆర్కు పంపిన ప్రభుత్వం
కొడాలి నానికి నోటీసు ఇస్తూ మర్యాదగా వ్యవహరించడమే నేరం!
గుడివాడ రూరల్: వైఎస్సార్సీపీకి చెందిన ఓ మాజీ మంత్రికి నోటీసు ఇచ్చిన సందర్భంగా ఆ ఎస్సై మర్యాదగా వ్యవహరించడమే చంద్రబాబు ప్రభుత్వానికి నచ్చలేదు. దానిపై పచ్చ మీడియాలో పిచ్చి కథనాలు రావడం, ఆ ఎస్సైని ప్రభుత్వం వీఆర్కు పంపడం చకచకా జరిగిపోయాయి. సాధారణంగా విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం చేసిన వారిని, ప్రజల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వారిని, తీవ్ర ఆరోపణలు ఉన్న వారిని వీఆర్కు పంపుతుంటారు.
కానీ, ఏ తప్పూ చేయని ఓ ఎస్సైని వీఆర్కు పంపడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చంద్రబాబు సర్కారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది మరో కోణం. ఈ నెల 10న వైఎస్సార్సీపీ డీఎస్సీ ర్యాలీలు చేపట్టింది. ఈ ర్యాలీని అడ్డుకొనేందుకు ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలువురు వైఎస్సార్సీపీ నేతలకు ముందస్తుగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)కి కూడా నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసులను గుడివాడ వన్టౌన్ ఎస్ఐ వై.వి.వి. సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి వెళ్లి కొడాలి నానికి అందజేశారు. ఈ సందర్భంగా నానితో మర్యాదగా మాట్లాడారు. ఇది నచ్చని చంద్రబాబు సర్కారు ఆ ఎస్సైపై కన్నెర్ర చేసింది. ఎస్సై సత్యనారాయణను వీఆర్కు పంపుతూ జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే రోజు ఎస్ఐతో పాటు పలువురు సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. కానీ వారిపై కాకుండా కేవలం నోటీసు ఇచ్చిన ఎస్ఐ సత్యనారాయణపైనే చర్యలు తీసుకోవడం గమనార్హం.


