‘సిద్ధూ మూసేవాలా కోడ్‌ ఏమిటి? కాంగ్రెస్‌ సీట్లతో లింక్‌ ఎందుకు? | What is Rahul Gandhi's Sidhu Moosewala Code? | Sakshi
Sakshi News home page

‘సిద్ధూ మూసేవాలా కోడ్‌ ఏమిటి? కాంగ్రెస్‌ సీట్లతో లింక్‌ ఎందుకు?

Jun 3 2024 7:17 AM | Updated on Jun 3 2024 9:07 AM

What is Rahul Gandhi's Sidhu Moosewala Code?

దేశంలో లోక్‌సభ ఎన్నికల ఏడు దశల ఓటింగ్ ముగిసింది. మంగళవారం(జూన్‌ 4) ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి ముందే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ విజయాన్ని ప్రకటించాయి. ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ గురించి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ‘ఇదొక ఫాంటసీ పోల్‌ అని వ్యాఖ్యానించారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా పాటను ప్రస్తావిస్తూ ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని  అన్నారు.

ఇంతకీ రాహుల్ గాంధీ సింగర్‌ సిద్దూవాలా ‘295’ పాటను ఎందుకు వినమన్నారు? విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం దీనిలో రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది కాంగ్రెస్‌ 295 లోక్‌సభ స్థానాలు సాధిస్తుందని, మరొకటి ఈ పాటలోని అర్థాన్ని తెలుసుకోవాలని కోరారు. మూసేవాలా పాడిన పాట ‘295’లో 295 అనేది కేవలం ఒక సంఖ్య కాదు. ఈ హిందీ పాటలోని అర్థం విషయానికి వస్తే దీనిలో మతం  ప్రస్తావన ఉంది. నిజం మాట్లాడే చోట సెక్షన్ 295 విధిస్తారు. ఎవరైనా అభివృద్ధి చెందిన చోట ద్వేషం రగులుతుంది. సెక్షన్ 295 పేరుతో మతానికి సంబంధించిన నిబంధనలు పెట్టారని పాటలో పేర్కొన్నారు.

ఈ పాట ప్రారంభంలో ‘అబ్బాయ్‌.. నువ్వు ఎందుకు నేల చూపులు చూస్తున్నావు? నువ్వు బాగా నవ్వేవాడివి కదా? ఈ రోజు మౌనం వహిస్తున్నావు? ఈ రోజు తలుపుపై ఉన్న నేమ్‌బోర్డును ఎత్తుకుపోయి, తిరుగుతున్న వారెవరో నాకు తెలుసు. వారు ఇక్కడ వారి ‍ప్రతిభను వ్యాపింపజేయాలనుకుంటున్నారు. నువ్వు కిందపడాలని కోరుకుంటున్నారు. వారు కీర్తి కాంక్షతో రగిలిపోతున్నారు. నీ పేరుతో ముందుకు రావాలని అనుకుంటున్నారు’ అని పాటలో వినిపిస్తుంది. రాహుల్‌ ఈ పాట ద్వారా కాంగ్రెస్‌ పరిస్థితిపై మీడియాకు సమాధానమిచ్చారు.

ఎగ్జిట్ పోల్ గణాంకాలు విడుదలైన తర్వాత ప్రతిపక్ష నేతలు ఈ లెక్కలను తప్పుపడుతున్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని, ఎన్డీఏ ప్రభుత్వం కాదని వారు అంటున్నారు. ఎగ్జిట్ పోల్ డేటాను ఎవరూ అంగీకరించబోరని కాంగ్రెస్ నేత పవన్ ఖేదా పేర్కొన్నారు. మీడియావారు మాతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు ఇండియా కూటమి పనితీరు అద్భుతంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నది ఊహాజనిత మార్కెట్‌ అయిన షేర్‌ మార్కెట్‌ కోసం జరిగిందా? లేక బీజేపీ  మరో కుట్ర పన్నుతోందా అని పవన్‌ ఖేదా ప్రశ్నించారు. దేశంలో బీజేపీ భక్తులు తప్ప ప్రతీ ఒక్కరూ ఈ ఎగ్జిట్ పోల్స్‌ను ఫేక్‌గా పరిగణిస్తున్నారన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement