
పట్నా: బీహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీలన్నీ తమ ప్రణాళికల్లో మునిగితేలుతున్నాయి. ఇటువంటి సమయంలో రాజధాని పట్నాలో ‘వాటర్ మెట్రో’ సేవలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయంటూ షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. పట్నా పట్టణం జల రవాణా వ్యవస్థకు కేంద్రంగా మారనున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వెలువడిన ఈ ప్రకటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లలో లోతట్టు జల రవాణా అభివృద్ధిపై పట్నాలో జరిగిన ఒక సమావేశంలో సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ కార్గో, పర్యాటకం, స్థానిక జీవనోపాధి కోసం నదీ వ్యవస్థల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ‘వాటర్ మెట్రో’ పట్నాకు మరో ఆధునిక రవాణా వ్యవస్థను అందించనున్నదన్నారు. దీనిని నేషనల్ ఇన్లాండ్ నావిగేషన్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేయనున్నదని తెలిపారు. గంగా నది ఒడ్డున ఉన్న బీహార్.. దేశంలో అంతర్గత జలమార్గ రవాణా కేంద్రంగా ఉద్భవించనున్నదని ఆయన అన్నారు.
వారణాసి నుండి హల్దియా వరకు 1,390 కి.మీ.ల పొడవున విస్తరించి ఉన్న జాతీయ జలమార్గం వన్లో ఉన్న బీహార్లోని పట్నాలో రెండు టెర్మినల్స్ ఏర్పాటు కానున్నాయని అన్నారు. అలాగే గంగా నది వెంబడి నౌకల మరమ్మతు, తయారీ కేంద్రం ఏర్పాటు కానున్నదని తెలిపారు. గంగా నది వెంబడి ఉన్న 12 జిల్లాల్లో అంతర్గత నావిగేషన్, జల ఆధారిత వాణిజ్యం కోసం మరిన్ని అవకాశాలను అన్వేషించేందుకు ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు కానున్నదని తెలిపారు.
బీహార్లో త్వరలో ప్రారంభం కాబోయే ‘వాటర్ మెట్రో’ అక్కడి ఎన్డీఏ ప్రభుత్వానికి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసివచ్చే అంశం కానున్నదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే ఈ వాటర్ మెట్రో యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నదనే వాదన వినిపిస్తోంది. తద్వారా ఇక్కడి యువత ఎన్డీఏవైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. జల రవాణా వ్యవస్థకు పట్నా కేంద్రంగా మారనున్నదని ప్రభుత్వం ప్రకటించడంతో స్థానికులు బీజేపీపై గంపెడు ఆశలు పెట్టుకున్నారనే మాట వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: టెహ్రాన్లో దారుణ పరిస్థితులు.. భారత విద్యార్థుల తిరుగుముఖం