మోర్బీ: నిండుకుండ తొణకదు అంటారు. కానీ గుజరాత్లోని మోర్పీ జిల్లాలో కుండ మాదిరిగానే ఉండాల్సిన బావి తుపాను వచ్చిన సంద్రంలా ఊగిపోతోంది. భారీ వర్షాలతో భూగర్భజలాశయాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో అప్పటిదాకా అక్కడ ఉన్న గాలి పైకి వచ్చే ప్రయత్నం ఫలితమే ఈ ఆసక్తికరమైన ఘటన అని అధికారులు తేల్చారు. బావి మొత్తం ఊగిపోతోందన్న చందంగా కనిపిస్తూండటంతో భూకంపం వస్తుందేమో అన్న అనుమానాలు స్థానికులు వ్యక్తం చేశారు. అయితే అలాంటి ప్రమాదమేమీ లేదని గుజరాత్ రాష్ట్ర వాటర్ డేటా టీమ్ స్పష్టం చేసింది.
గాంధీ నగర్ నుంచి శుక్రవారం విచ్చేసిన ఈ బృందం భూగర్భంలో అసాధారణ కదలికలేవీ లేవని, భూకంప ప్రమాదమూ లేదని భరోసానిచ్చింది. దాదాపు 18 అడుగుల లోతైన ఈ బావిలో ఐదు రోజులుగా అలలు ఏర్పడుతున్నాయి. ఆగస్టు రెండున తొలిసారిగా ఈ అసాధారణ కదలికను గమనించినట్లు బావి ఉన్న పొలం యజమాని ప్రజీవన్ సదారియా చెప్పారు. సుమారు మూడు నెలల క్రితమే ఈ బావిని నిర్మించినట్లు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల భూగర్భ జలాశయాలు నిండే క్రమంలో ఇలా జరుగు అంచనా వేస్తున్నారు. భూగర్భ జలాశయాల్లో రాళ్లలోని ఖాళీ ప్రదేశాల్లో చిక్కుకున్న గాలి బయటకు వచ్చే క్రమంలో బావిలోని నీరు కదులుతూండవచ్చునని మోర్బీ జిల్లా భూగర్భ శాస్త్రవేత్త జే.ఎస్.వాధేర్ తెలిపారు.


