అహ్మదాబాద్: గుజరాత్లో అరుదైన 'చండీపుర వైరస్' ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరల్ వ్యాధి బారిన పడి ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఏడుగురు పిల్లలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 184 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, వారిలో 35 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని వైద్యులు వెల్లడించారు. అయితే, వైరస్ బారిన పడిన వారంతా 15 ఏళ్లలోపు చిన్నారులేనని మంత్రి ప్రఫుల్ పన్సేరియా తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు పిల్లలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు.
దీంతో గుజరాత్లోని పలు ప్రాంతాల్లో చండీపుర వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ, పరీక్షలు, వైద్య చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.
అధికారుల ప్రకారం, 'చండీపుర ఎన్సెఫలైటిస్' అనేది అరుదైన వైరల్ వ్యాధి. ఇది ఇసుక ఈగల ద్వారా వ్యాపించి మెదడు వాపునకు దారితీస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా 15 ఏళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపుతోందని, అయితే, ఈ వ్యాధికి ప్రస్తుతం నిర్దిష్టమైన టీకా లేదా యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేనట్లుగా వైద్యలు తెలిపారు. అలాగే, సకాలంలో చికిత్స అందకపోతే వాంతులు, మూర్ఛ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


