శ్రీకాకుళం అభ్యర్థిని మార్చాల్సిందే | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం అభ్యర్థిని మార్చాల్సిందే

Published Thu, Mar 28 2024 8:10 AM

Ticket Fight In Srikakulam Tdp - Sakshi

అధిష్టానం ప్రతినిధి శ్రీనివాసులురెడ్డి ఎదుటే ఆల్టిమేటం జారీ

టీడీపీ క్యాడర్‌ను రోడ్డుకీడుస్తానని శంకర్‌ చెప్పడంపై ఫిర్యాదు

లోకేష్‌తో మాట్లాడేందుకు సమేమిరా అన్న గుండ దంపతులు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గంలో బీజెపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్న గొండు శంకర్‌ను మార్చి, గుండ లక్ష్మీదేవికి టిక్కెట్‌ కేటాయించాల్సిందేనని జోనల్‌ కో–ఆర్డినేటర్‌ శ్రీనివాసులురెడ్డికి శ్రీకాకుళం నగర తెలుగుదేశం క్యాడర్‌ ఆల్టిమేటం జారీ చేసింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం జోనల్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాసులురెడ్డి అరసవల్లిలోని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నివాసానికి చేరుకొని వారితో సమావేశమయ్యారు. అనంతరం క్యాడర్‌తో మాట్లాడారు. చంద్రబాబునాయుడు గుండ దంపతులను తీసుకొని రమ్మన్నారని ఆ విషయాన్ని వారిద్దరికీ వివరించారు.

దీనికి గుండ దంపతులు స్పందిస్తూ చంద్రబాబుతోనే మాట్లాడుతామని, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌తోనైతే మాట్లేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. మరో రెండు మూడు రోజుల్లో వారు చంద్రబాబునాయుడును కలిసేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. దీనిపై నగర తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఏది ఏమైనా శ్రీకాకుళం అసెంబ్లీ టిక్కెట్‌ లక్ష్మీదేవికి కేటాయించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. నగరానికి చెందిన 50 డివిజన్లలో 45 డివిజన్లకు చెందిన ఇన్‌చార్జులంతా గుండ లక్ష్మీదేవి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.

రెండేళ్లుగా క్రమశిక్షణ తప్పిన అసమ్మతి నేతకు టిక్కెట్‌ కేటాయించడంపై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి పరిస్థితిని చంద్రబాబునాయుడుకు వివరించి లక్ష్మీదేవికి టిక్కెట్‌ వచ్చేలా చూడా లని కోరారు. దీనికి సమాధానంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మీ ఆవేదన తనకు అర్థమైందని చంద్రబాబు వద్దకు గుండ దంపతులను తీసుకెళ్లడం వరకే తన బాధ్యతని వివరించారు. టికెట్‌ ఇస్తే గుండకే ఇవ్వాలని, యూత్‌ కోటా అనుకుంటే వారి కుమారుడికి ఇవ్వాలే తప్ప గొండు శంకర్‌కి కన్ఫర్మ్‌ చేస్తే తాము ఒప్పుకోబోమని కార్యకర్తలు అన్నారు.

Advertisement
Advertisement