పేపర్‌ లీడర్‌ కావాలా.. పీపుల్‌ లీడర్‌ కావాలా?  | State President of IMA joined BRS | Sakshi
Sakshi News home page

పేపర్‌ లీడర్‌ కావాలా.. పీపుల్‌ లీడర్‌ కావాలా? 

Aug 26 2023 1:45 AM | Updated on Aug 26 2023 1:45 AM

State President of IMA  joined BRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు చేసే మంచి పనులకంటే ఎక్కువగా ఎదుటి వారిని తిట్టిన వార్తలకే మీడియాలో ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేపర్‌ లీడర్‌ కావాలో, సరైన పీపుల్‌ లీడర్‌ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆలోచించాలని చెప్పారు. స్ట్రాంగ్‌ లీడర్‌ కావాలో లేదా రాంగ్‌ లీడర్‌ కావాలో నిర్ణయించుకోవాలన్నారు.

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌ రావు, వివిధ జిల్లాల అధ్యక్షులు, వైద్యులు శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ, వైద్యులు తెలంగాణ భవన్‌లోకి వచ్చి పార్టీలో చేరడం గొప్ప విషయమన్నారు.

ఒకప్పుడు బెంగాల్‌ ఏది ఆచరిస్తే, దేశం అది అనుసరిస్తుందనే వారని, ఇప్పుడు ఆ మాటను తెలంగాణ తిరగరాసిందని చెప్పారు. ‘24 గంటల ఉచిత కరెంట్‌ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరోటి లేదు. అందుకే స్ట్రాంగ్‌ లీడర్‌ చేతిలో రాష్ట్రం ఉండాలి, రాంగ్‌ లీడర్‌ చేతిలో పెట్టొద్దు. మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేసేందుకు అందరం కలిసి కృషి చేద్దాం’అని హరీశ్‌రావు చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement