Political Senior Leaders Will Join In Telangana Congress, Check Names Inside - Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ అలర్ట్‌.. తెలంగాణలో చక్రం తిప్పిన కాంగ్రెస్‌!

Jul 19 2023 8:44 AM | Updated on Jul 19 2023 11:08 AM

Political Senior Leaders Will Join In Telangana Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ జెట్‌ స్పీడ్‌లో దూసుకోపోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు హాజరు కానున్నారు. 

రేపు ఢిల్లీకి రేవంత్‌..
ఈ సందర్భంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకే పార్టీ ముఖ్యులను కోమటిరెడ్డి లంచ్‌కు ఆహ్వానించారని తెలియవచ్చింది. త్వరలో పార్టీలో చేరే నాయకుల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకొనే దిశగా చర్చలు జరిపేందుకే ఈ భేటీ జరగనుందని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత రేవంత్‌రెడ్డితోపాటు ఠాక్రే, ఇతర ముఖ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. గురువారం వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. ప్రియాంకా గాంధీ సమక్షంలో జూపల్లి, కూచుకుళ్ల బృందంతోపాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన పలువురు నేతలు కూడా వారితోపాటు వెళ్లి ఖర్గేను కలుస్తారని తెలుస్తోంది. 

కాంగ్రెస్‌లో భారీ చేరికలు.. 
ఇక, ఈ జాబితాలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, నల్లగొండకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఓ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్, ప్రముఖ ట్రావెల్స్‌ అధినేత, ఆదిలాబాద్‌కు చెందిన మరో కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం భేటీ అనంతరం కోమటిరెడ్డి నివాసంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారని, ఈ సమావేశంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్‌ నేతలు స్పష్టతనిస్తారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చదవండి: ‘కాంగ్రెస్‌లో చేరినందుకే కక్ష సాధింపు చర్యలు’

Advertisement
 
Advertisement
Advertisement