డాక్టర్ ప్రియాంక మృతిపై వైఎస్ జగన్‌ ఆందోళన | YS Jagan expresses concern over Priyanka death and fires on Chandrababu Govt | Sakshi
Sakshi News home page

డాక్టర్ ప్రియాంక మృతిపై వైఎస్ జగన్‌ ఆందోళన

Aug 9 2026 10:52 PM | Updated on Aug 9 2026 11:23 PM

YS Jagan expresses concern over Priyanka death and fires on Chandrababu Govt

సాక్షి, తాడేపల్లి: రాజమండ్రిలో మెడికల్‌ పీజీ విద్యార్థిని డాక్టర్‌ ప్రియాంక మృతి తనను తీవ్రంగా కలచివేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రియాంక కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి, అనేక కష్టాలను ఎదుర్కొని తమ కుమార్తెను డాక్టర్‌గా తీర్చిదిద్దారని జగన్‌ పేర్కొన్నారు. ఎండీ చదువులు కూడా చదివిస్తూ, తమ కుమార్తె భవిష్యత్తులో పదిమందికి వైద్య సేవలు అందించే స్థాయికి ఎదుగుతుందన్న ఆశతో ఉన్న తల్లిదండ్రులకు ఆమె మృతి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. డాక్టర్‌ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయిన తీరు మరోసారి బయటపడింది. కేవలం ప్రతిపక్షంమీద, ప్రశ్నించేవారిమీద, తప్పులు ఎత్తిచూపుతున్నవారిమీద రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో,చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్న తీరు ఓవైపు చూస్తుంటే... మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్టప్రకారం నడుచుకోవడంలో ప్రభుత్వం,పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరం.

ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన జరిగితే,ఆ ఘటన ఒక షాపింగ్‌మాల్‌ గేటు బయటే జరిగితే, వాళ్లు మద్యం తాగి ఉన్నారని తెలిసినా,వెంటనే సీసీ కెమెరాలు చూసి, నేరం తీవ్రతను బట్టి కేసులు పెట్టాల్సిందిపోయి దాన్ని సాధారణ యాక్సిడెంట్‌ కేసుగా చిన్నదిగా చూపించి,నిందితులను కూడా వదిలేసి పోలీసులు చేతులు దులుపేసుకునే కార్యక్రమం చేయడం అత్యంత దారుణం. నిందితులు తమ కారుతో డాక్టర్‌ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టడమే కాదు,తర్వాత కూడా వారు అమానవీయంగా ప్రవర్తించి,బాధితురాలి మీద నుంచి కారు తోలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఇంత అలసత్వంగా ఎందుకు పనిచేసిందన్న దానిపై పూర్తిస్థాయి విచారణ జరగాలి.

డాక్టర్‌ ప్రియాంక తండ్రి ఆవేదనకు ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించి తప్పుడు కేసులు పెట్టి,రాజకీయ వేధింపులకు, కక్షసాధింపులకు చంద్రబాబుగారు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్న తీరే దీనికి అంతటికీ కారణం. అంతేకాదు వీధికి రెండు బెల్టుషాపులు, ప్రతి కిలోమీటర్‌కు మద్యం షాపు, గుడి, బడి, బీచ్‌ ఏదీ వదలకుండా, ప్రతి వీధి చివర, అంతులేని బార్‌ అండ్‌ రెస్టారెంట్లతో మద్యానికి, గంజాయికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన చంద్రబాబు తీరుకూడా దీనికి మరో కారణం. డాక్టర్‌ ప్రియంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తుంటే,వాటికి సమాధానాలు చెప్పలేక ఆ కంటెంట్‌ను కూడా చంద్రబాబుగారు,తన ప్రభుత్వ పోలీసులతో నిమిషాల వ్యవధిలో వాటిని తొలగిస్తున్నారు.పౌరులందరిపట్లా ఒకేలా వ్యవహరించాల్సిన వ్యవస్థల్లోకి రాజకీయ కక్షసాధింపులు, పక్షపాతం, ‘మీది ఏ పార్టీ?’ అన్న తప్పుడు పద్ధతులను తీసుకురావడం వల్ల, ఆ వ్యవస్థల మూలాలు కదిలిపోయి, కుప్పకూలిపోయే స్థాయికి చేరుకున్నాయని చంద్రబాబు గల ఇప్పటికైనా గమనిస్తే మంచిది.
-వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement