కడప: ఏపీ రాష్ట్ర ఖజానాకు భారీగా పన్నులు చెల్లిస్తున్న భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (భారతి సిమెంట్స్)పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పరాకాష్టకు చేరింది. నాలుగు రోజులుగా టీడీపీ మూకలు చేస్తున్న దౌర్జన్యంతో కాప్టివ్ మైన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
మైన్లోకి వాహనాలు వెళ్లకుండా టీడీపీ మూకలు పదే పదే అడ్డుకుంటున్నాయి. సున్నపురాయి సరఫరా జరగకుండా భారతి సిమెంట్స్ ఉత్పత్తిని అడ్డుకునే కుట్రకు తెరలేపారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్సీ, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. టీడీపీ మూకల దౌర్జన్యంతో భారతి సిమెంట్స్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. టీడీపీ మూకల దౌర్జన్యంతో ఉత్పత్తి ఆగిపోతు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 15 వేల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
చంద్రబాబు నుంచి అందిన ఆదేశాలతో అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందనే విషయం అర్థమవుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదంటే చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందా? అనే అనుమానం కలగమానదు.
పరిశ్రమ నడవకూడదన్నదే లక్ష్యమా? రాజకీయ పగ కోసం రాష్ట్ర పారిశ్రామిక ప్రయోజనాలనే పణంగా పెడతారా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇదే తరహాలో రాజకీయ కక్షతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కార్యకలాపాలను అడ్డుకుని ఉంటే ఆ సంస్థ ప్రశాంతంగా వ్యాపారం కొనసాగించగలిగేదా? అని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ తరహా దాడులకు ప్రభుత్వ పెద్దలు ఉసిగొల్పుతున్నారని అభిప్రాయపడుతున్నారు.


