
సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో సత్యవతి రాథోడ్, రాజయ్య, బండా ప్రకాశ్, మధుసూదనాచారి, ఎర్రబెల్లి తదితరులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రెండున్నర దశాబ్దాలుగా ప్రజలతో పార్టీ మమేకం.. బీఆర్ఎస్తో హిమాలయాల స్థాయికి తెలంగాణ కీర్తి
27న పల్లెల్లో గులాబీ జెండాలు ఎగురవేయాలి.. కదం తొక్కుతూ వరంగల్ చేరుకోవాలని పిలుపు
ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాల పరిశీలన
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని, చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఈ నెల 27న నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక సభకు ఉద్యమాల గడ్డ ఓరుగల్లు వేదిక కావడం గర్వంగా ఉందని అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. తొలుత జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా
‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మార్గంలో బోధించు, సమీకరించు, పోరాడు అనే ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను సాధించాలనే నినాదంతో కేసీఆర్ నాయకత్వంలో బీ(టీ)ఆర్ఎస్ పురుడు పోసుకుంది. ఒక ఉద్యమ పార్టీగా ఏర్పడి తెలంగాణను సాధించడంతో పాటు అధికారాన్ని చేపట్టి అద్భుతమైన పాలన అందించింది. ప్రభుత్వంగా, ప్రతిపక్షంగా హిమాలయాల స్థాయికి తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్. రెండున్నర దశాబ్దాలుగా ప్రజల్లో ఉంటోంది. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా..’ అని కేటీఆర్ చెప్పారు.
సభా స్థలికి నలుమూలలా పార్కింగ్ ఏర్పాట్లు
‘రజతోత్సవ సభ కోసం ఎల్కతుర్తి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా 1,250 ఎకరాల్లో సభ, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభాస్థలికి నలుమూలలా పార్కింగ్ ఉంటుంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వారికి 260 ఎకరాల్లో గోపాల్పూర్ రోడ్డువైపు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే వావానాల కోసం ఎల్కతుర్తి సమీపంలో హుజూరాబాద్ మార్గంలో మరో 250 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల వారికి ఎల్కతుర్తికి ఆర కిలోమీటర్ దూరంలోనే 600 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంటుంది.
10 లక్షల చొప్పున వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు
సభకు హాజరయ్యే వారి కోసం 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాం. వీటిని ఇంకా పెంచుతాం. వెయ్యికి పైగా వైద్య బృందాలు, 20 అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు మీద నమ్మకం లేదు. అందువల్ల 200 జనరేటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. 2 వేల మంది వలంటీర్లు సభకు వచ్చే వారికి సహకరిస్తారు..’ అని కేటీఆర్ తెలిపారు.
సూర్యాపేట రైతులకు సలాం
‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూడాలి. ఆయన మాట వినాలన్న ఆత్రుతతో ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ అరాచక పాలనను వరంగల్ సభలో ఎండగడదాం. కేసీఆర్ సందేశాన్ని గులాబీ సైనికులు ప్రతీ గ్రామానికీ చేర్చాలి. 27వ తేదీన తెలంగాణలోని 12,796 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాలు ఎగురవేసి కదం తొక్కిన ఉత్సాహంతో చలో వరంగల్ సభకు చేరుకోవాలి. మండుటెండలను లెక్కచేయకుండా రజతోత్సవ సభ కోసం ఎడ్లబండ్లలో బయలుదేరిన సూర్యాపేట రైతులకు సలాం చేస్తున్నా. మనమందరం వారిని ఆదర్శంగా తీసుకోవాలి..’ అని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డాక్టర్ బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.