70 వేల ఉద్యోగాలు ఇచ్చుంటే.. రాజకీయ సన్యాసం | BRS Working President KTR Challenges CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

70 వేల ఉద్యోగాలు ఇచ్చుంటే.. రాజకీయ సన్యాసం

Jul 19 2026 5:15 AM | Updated on Jul 19 2026 6:24 AM

BRS Working President KTR Challenges CM Revanth Reddy

సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌

 రాహుల్‌గాందీకి జై కొడతా.. 

ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్‌ తాగి చావమంటున్నాడు 

కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్‌ పెద్ద మోసం.. యువత జంగ్‌ సైరన్‌ మోగించింది.. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క..  

2028లో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. కేసీఆరే సీఎం 

సరూర్‌నగర్‌ యువ సంగ్రామ సదస్సులో గులాబీ నేత

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే.. నేను రాజకీయ సన్యాసం చేసి, రాహుల్‌గాం«దీకి జై కొడతా’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సరూర్‌నగర్‌ స్టేడి యం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ యువజన, విద్యార్థి విభా గం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘యువ సంగ్రామ సదస్సు’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరోలెక్క.. ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువతరం ఇక్కడికి వచ్చింది. జంగ్‌ సైరన్‌ మోగించిన యంగ్‌ జనరేషన్‌ కాకతీయ, ఉస్మానియా, మహాత్మాగాం«దీ, శాతవాహన వర్సిటీలతోపాటు అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి యువశక్తి శివమెత్తి పోటెత్తింది. పిడికిళ్లు బిగిస్తే.. పీఠాలే కదిలిపోతాయి. తెలంగాణ ఉద్యమంలో యువత కలిసి వచ్చింది. రేపటి తెలంగాణ నిర్మాతలు మీరే. దేశ భవిష్యత్తుకు నిర్ణేతలు మీరు’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.   

వారికి డెత్‌ డిక్లరేషన్‌ రాయాలి 
‘సరిగ్గా 38 నెలల క్రితం ఇదే నేలపై తెలంగాణ యువతకు దారుణమైన దగా జరిగింది. ప్రియాంకగాం«దీతోపాటు ఢిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్, హై కమాండ్‌ నుంచి గాం«దీలు, గాంధీ భవన్‌ నుంచి గాడ్సేలు కలిసి వచ్చి.. మాయామశ్చింద్ర చేశారు. యూత్‌ డిక్లరేషన్‌ పేరుతో నయవంచనకు పాల్పడ్డారు. మన యువతకు 24 హామీలు ఇచ్చారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి రాలేదు. 

డిగ్రీ పాసైతే రూ.లక్ష రాలేదు. పీహెచ్‌డీ చేస్తే రూ.ఐదు లక్షలు రాలేదు. అధిష్టాన పుత్రుడు రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చిండు. చాయ్‌ తాగి, బిస్కెట్లు తిన్నడు. తెలంగాణ నిరుద్యోగులకు బిస్కెట్లు వేశాడు. రెండు (కేసీఆర్, కేటీఆర్‌) ఉద్యోగాలు తీసేస్తే.. ఒకేసారి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. కొలువుల కుంభమేళా అన్నారు. కుంభకోణాల పర్వానికి తెరతీశారు. యూత్‌ డిక్లరేషన్‌ చేసిన రాహుల్‌గాం«దీకి, ప్రియాంకగాంధీకి, రేవంత్‌రెడ్డికి డెత్‌ డిక్లరేషన్‌ రాయాల్సిన అవసరం ఉంది’ అని కేటీఆర్‌ చెప్పారు. 

నిన్ను సీఎంను చేసింది ఇందుకేనా..? 
‘రాహుల్‌కు ప్రధాని జాబ్‌ వచ్చే వరకు విడిచి పెట్టబోననని సీఎం రేవంత్‌ చెబుతున్నాడు. తెలంగాణ యువత నిన్ను సీఎం చేసింది యువతకు జాబ్‌లు ఇవ్వాలని, లేక రాజకీయ నిరుద్యోగి రాహుల్‌కు ప్రధాని జాబ్‌ ఇవ్వమనా..? ఒక్క ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబులు నింపడం లేదు కానీ రాహుల్‌గాంధీ జేబులు, అన్నదమ్ముల అల్మారాలు బినామీల బీరువాలు నింపుతున్నాడు. 

ఉస్మానియా, కాకతీయ పీహెచ్‌డీ విద్యార్థులు.. ‘ఓటు కోసం కోటి మోసాలు.. కాంగ్రెస్‌ నాటకాలు’ అనే థీసిస్‌ చేయాలి. 20 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని నింపాలని దిల్‌సుఖ్‌నగర్‌లో ఆందోళన చేస్తుంటే.. లాఠీలు ఝళిపిస్తున్నాడు. దమ్ముంటే సెక్యురిటీ లేకుండా వీఎం హోంకు రా? ఎవరు ఉంటారో? ఎవరు చస్తాడో ? తేలుతుంది. నీ క్‌లైమాక్స్‌ హిట్లర్‌ కంటే దారుణంగా ఉంటుంది’ అని కేటీఆర్‌ చెప్పారు. 

వాళ్లది పోటీ పరీక్షలు రాసిన ముఖమా? 
‘పట్టాలు చేతపట్టుకుని, కిరాయి కట్టలేక, ఖాళీ కడుపుతో నిద్రహారాలు మాని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల పరిస్థితి మాకు తెలుసు. ఇలాంటి వారి జీవితాలతో కాంగ్రెస్, బీజేపీలు పరిహాసమాడుతున్నాయి. కేంద్రంలోని బడేభాయ్‌ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాÐనన్నాడు. ఇక్కడి చోటే భాయ్‌ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. పకోడీలు, చెకోడీలు వేసుకొమ్మని మోదీ చెబుతుంటే.. ఎండ్రిన్‌ తాగి చావండని రేవంత్‌ చెబుతున్నాడు. పోటీ పరీక్షలకు హాజరు కావడం, ఉద్యోగం కొట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు.. కానీ బండి సంజయ్, రేవంత్‌ ఒక్క పోటీ పరీక్ష రాసిన ముఖం కాదు. 

తెచ్చుకున్న తెలంగాణ తెర్లవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నేపాల్‌ మాదిరి భూకంపం పుట్టించమనడం లేదు. శ్రీలంకలా శివతాండవం చేయమనడం లేదు. ప్రభుత్వాన్ని కూల్చమనడం లేదు. మాది అల్లర్లు సృష్టించి, కేసుల్లో ఇరికించి, నెత్తురు చిందించి తప్పించుకునే పార్టీ కాదు. విద్యార్థులకు అండగా ఉంటాం. 2028లో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్సే. కేసీఆరే సీఎం. గతంలా కాకుండా ఈసారి మీ పూర్తి బా«ధ్యతను తీసుకుంటా. ఓ అన్నగా అండగా ఉంటా’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

స్కైరూట్‌కు అభినందనలు.. 
‘బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రైవేటు రంగంలో 26 లక్షల కొలువులు సృష్టించాం. ప్రతి మూడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఒకటి హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. ఊహలకు రెక్కలిచ్చి ఆలోచనలకు ఆవిష్కరణలుగా మార్చే ఒక టీహబ్‌ను సృష్టించాం. ఇక్కడ పురుడు పోసుకున్న స్కైరూట్‌.. 79 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ రాకెట్‌ను నింగిలోకి పంపింది.. స్కైరూట్‌ను అభినందిస్తున్నాం’ అని కేటీఆర్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement