భయంతో తాను కూడా ఉరివేసుకున్న యువకుడు
కట్టంగూర్: యువకుడి వేధింపులకు వైద్య విద్యార్థిని ఆత్మ హత్య చేసుకోగా.. ఆ విషయం తెలుసుకున్న యువకుడు కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామానికి చెందిన సుక్క లింగయ్య, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. లింగయ్య ఢిల్లీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కూతురు లక్ష్మీప్రసన్న (21) సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన చిలుముల రామ్చరణ్ (21) కొంత కాలంగా ప్రేమించాలంటూ లక్ష్మీప్రసన్న వెంటపడుతున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావటంతో లక్ష్మీప్రసన్న ఈ నెల 16న కళాశాల నుంచి స్వగ్రామానికి వచ్చింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
యువకుడి ఆత్మహత్య: లక్ష్మీప్రసన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొన్న రామ్చరణ్ భయాందోళనకు గురయ్యాడు. గ్రామస్తులు, పోలీసులకు దొరకకుండా శుక్రవారం అర్ధరాత్రి వ్యవసాయ బావి వద్ద ఉన్న తన తండ్రి సమాధి వద్దకు వెళ్లాడు. బ్లేడ్తో చేతిని కోసుకొని సమాధిపై తన రక్తంతో ‘చరణ్, చిన్నారి (లక్ష్మీప్రసన్న)’అని రాశాడు. అనంతరం తాటిచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు రెండేళ్లుగా లక్ష్మీప్రసన్నతో ప్రేమలో ఉన్నాడని, ఆమె దక్కలేదనే మనస్తాపంతో చనిపోయాడని పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో జానకమ్మ పేర్కొంది.


