ప్రభుత్వం 7 నెలలుగా బిల్లులు చెల్లించలేదంటూ సరఫరా నిలిపేసిన కాంట్రాక్టర్లు
ఈ నెల 15 నుంచి 35 వేలకుపైగా కేంద్రాలకు నిలిచిన సరఫరా
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నిలిచిపోనున్న గుడ్ల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరాను కాంట్రాక్టర్లు నిలిపేశారు. ప్రభుత్వం నుంచి ఏడు నెలలుగా బిల్లులు అందకపోవడంతో బకాయిలు చెల్లించాకే గుడ్లు సరఫరా చేస్తామని తేల్చిచెబుతూ ఈ నెల 15 నుంచి గుడ్ల సరఫరాను ఆపేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు కోడిగుడ్ల పంపిణీకి బ్రేక్ పడనుంది.
35,780 అంగన్వాడీ కేంద్రాలకు 25 మంది కాంట్రాక్టర్లు
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్(ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్) ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35780 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 24942 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో, 6655 పట్టణ ప్రాంతాల్లో, 4184 ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో 3,32,943 మంది గర్భిణులు, బాలింతలతోపాటు మూడేళ్లలోపు వయసున్న 9,53,834 మంది చిన్నారులు, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు వయసున్న 8,57,206 మంది పిల్లలు ఉన్నారు.
ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, మూడేళ్లలోపు చిన్నారులకు నిర్దేశించిన రోజుల్లో కోడిగుడ్లు అందిస్తున్నారు. కొన్నిచోట్ల ఉడికించిన కోడిగుడ్లను పంపిణీ చేస్తుండగా... మరికొన్ని చోట్ల నేరుగా ఇచ్చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 3 కోట్లకుపైగా గుడ్లు ఏటా సుమారు 37 కోట్ల గుడ్లు సరఫరా జరగాలి. ఇందుకోసం జిల్లాలవారీగా టెండర్లు పిలిచిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. 25 మంది కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. జిల్లాకు ఒకరు చొప్పున కాంట్రాక్టర్లను ఎంపిక చేయగా ఒకట్రెండు జిల్లాలను మాత్రం ఒకే కాంట్రాక్టరుదక్కించుకున్నారు.
ఏడు నెలలుగా చెల్లింపులు బంద్...
అంగన్వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్లు గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 11 నెలలపాటు కోడిగుడ్లను సరఫరా చేయగా అందులో 4 నెలల బిల్లులను మాత్రమే ప్రభుత్వం క్లియర్ చేసింది. గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కోడిగుడ్ల సరఫరాకు సంబంధించి టోకెన్లు జనరేట్ చేసినప్పటికీ.. ఆర్థిక శా ఖ వాటిని ఆమోదించలేదు. ఆ తర్వాత జనవరి నుంచి మార్చి నెలకు సంబంధించిన చెల్లింపులను ప్రత్యేక కోటాలో చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు చేసిన సరఫరాకు సంబంధించిన బిల్లులను అధికారులు ఆన్లైన్లో ఆమోదించి ట్రెజరీలకు పంపారు. ఇవి కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రస్తుతం పెండింగ్లో 7 నెలలకు సంబంధించి రూ. 125 కోట్ల మేర ఉన్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే..
కోడిగుడ్ల సరఫరాకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్ని కాంట్రాక్టర్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శితోపాటు ఆ శాఖ సంచాలకుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఈ అంశంపై స్పందన రాకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే సరఫరా నిలిపివేసినట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒకసారి, ఆ తర్వాత నుంచి 30వ తేదీ వరకు రెండోసారి కోడిగుడ్లను సంబంధిత స్టాక్ పాయింట్ల వద్దకు చేరుస్తున్నారు. కానీ ఈ నెల 15 నుంచి సరఫరాను నిలిపివేయడంతో లబ్ధిదారులకు కోడిగుడ్లు అందించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.


