ఓటర్ల జాబితా సవరణ.. | KSR's Comments On The Voter List Revision Undertaken By The Election Commission | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితా సవరణ..

Jun 22 2026 2:08 PM | Updated on Jun 22 2026 3:13 PM

KSR's Comments On The Voter List Revision Undertaken By The Election Commission

దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై(సర్) రాజకీయ పార్టీలకు పలు అనుమానాలు కలిగే పరిస్థితి ఉండడం దురదృష్టకరం. దీనికి దేశంలోని ఆయా వ్యవస్థలు బాధ్యత వహించాలి. దేశంలో ఇప్పటికీ బోగస్ ఓట్లతో ఎన్నికలు జరపడం, కొందరి ఓట్లు గల్లంతవడం, పలువురికి రెండు, మూడు చోట్ల ఓట్లు ఉండడం, ఈవీఎమ్‌ల టాంపరింగ్ అవకాశం, వివిపాట్ స్లిప్ల లెక్కింపు జరగకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల కమిషన్ విఫలం అవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమికి ఉపయోగపడేలా పనిచేస్తోందన్న ఆరోపణ వల్ల కమిషన్ చిత్తశుద్ధిపై ప్రజలలో అనుమానాలు తలెత్తుతున్నాయి.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు రంగం సిద్ధం అయింది. రాజకీయ పార్టీలతో ఏపీ, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారులు సమావేశం అయి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నందున, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అప్రమత్తం అయ్యాయి. కాంగ్రెస్ అభిమానుల ఓట్లు తొలగింపునకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గాంధీభవన్‌లో ఒక సమావేశం పెట్టుకుని కార్యాచరణ రూపొందించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను కూడా ఒక నియోజకవర్గం బాధ్యతలు తీసుకుని ఓటర్ల జాబితా తీరుపై దృష్టి పెడతామని అనడాన్ని బట్టి ఆ పార్టీ ఎంత సీరియస్‌గా ఉంది అర్థం చేసుకోవచ్చు.

ఈ సందర్భంలోనే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీనిపై శ్రద్ధ వహించడం లేదని, జమిందార్ల మాదిరి వ్యవహరిస్తున్నారని కూడా ఘాటు వ్యాఖ్య చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ సైతం ఓటర్ల జాబితా అంశంలో పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. గతంలోనే కొన్ని ఇళ్లలో నలభై, ఏభై ఓట్లు ఉన్న విషయాన్ని గుర్తుచేసి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కాగా బీజేపీ నేతలు మాత్రం పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల ఆరోపణలను తిప్పికొడుతున్నారు.

ఏపీ విషయానికి వస్తే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ సర్ లో వైఎస్సార్‌సీపీకి నష్టం జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టారు. నియోజకవర్గంవారీగా బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి తగు శిక్షణ ఇప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇలాంటి వ్యూహాలలో ఉన్న అనుభవం రీత్యా వైఎస్సార్‌సీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది.

విశేషం ఏమిటంటే సర్ కార్యక్రమంపై టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కూడా పిలుపు ఇచ్చారు. టీడీపీ ఓట్లు తొలగించేలా వైఎస్సార్‌సీపీ కుట్రలు చేయవచ్చని ఆయన అన్నారు. అంతేకాదు 2019 ఎన్నికలకు ముందు టీడీపీ  అధికారంలో ఉన్నా, పార్టీ సానుభూతిపరుల ఓట్లను వైఎస్సార్‌సీపీ కుట్రపూరితంగా తొలగించిందని ఆయన ఆరోపించారట. అదే ఆయనలో ఉన్న విశిష్టత. తాను ఏదైనా చేయదలచుకుంటే, తొలుత ప్రత్యర్థులపై ఆ బురద చల్లుతారని రాజకీయపార్టీలలో ఒక అభిప్రాయం ఉంది. సరిగ్గా అదే రీతిలో ఆయన మాట్లాడారు.

నిజానికి 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరూ అలా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించినట్లు ఆరోపణలు రాలేదు. పైగా సేవామిత్ర యాప్ పేరుతో చంద్రబాబు ఆధ్వర్యంలోనే టీడీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితాలో లేకుండా చేయడానికి ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు విజయనగరం జిల్లాలో అలా సేవా మిత్ర యాప్ ద్వారా కొందరు ఉద్యోగులు ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందో తెలుసుకునే యత్నం చేయడాన్ని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆనాడు బహిర్గతం చేశారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో తమిళనాడు, కర్నాటకలలోని సరిహద్దు గ్రామాలకు చెందినవారిని ఓటర్లుగా చేర్పించారని, తద్వారా సుమారు ముప్పైవేల నుంచి నలభైవేల బోగస్ ఓట్లు అక్కడ ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తుంటుంది.

గతంలో చంద్రబాబుపై పోటీచేసిన వైఎస్సార్‌సీపీ నేత, దివంగత మాజీ ఐఏఎస్ చంద్రమౌళి నిత్యం దీనిపై పనిచేసి 17వేల ఓట్లను తొలగించగలిగారు. అయినా అంతకన్నా డబుల్ బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన చెబుతుండేవారు. తాజాగా వైఎస్ జగన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి కుప్పంలో 20వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు ఎన్నడూ వివరణ ఇవ్వలేదు. బీసీ వర్గాలు అధికంగా ఉండే కుప్పాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకోవడమే కాకుండా ఇలా బోగస్ ఓట్లను కూడా చేర్పించడం ద్వారా తనకు తిరుగులేని పరిస్థితిని తెచ్చుకున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి టెక్నిక్‌లు అమలు చేయడంలో చంద్రబాబుకు మరెవ్వరూ సాటిలేరని గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి నేతలు విమర్శించేవారు.

చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఒక భారీ ర్యాలీ తీసి బోగస్ ఓట్ల జాబితాపై గవర్నర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు. అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించడం, చనిపోయినవారి ఓట్లు తొలగించడం, డూప్లికేట్ ఓట్లు లేకుండా చూడడం, ఇతర ప్రాంతాలవారు ఓటర్లుగా ఉంటే వాటిని తీసివేయడం వంటి లక్ష్యాలతో ఈ సవరణ జరుగుతుంది. నిజానికి దీని ఆశయం మంచిదే. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే వేలాది మంది ఓటర్లు అటు ఏపీకి, ఇటు తెలంగాణ జిల్లాలకు ఎన్నికల సమయంలో వెళుతుంటారు. తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటారు. వీరికి రెండేసి ఓట్లు ఉండడం చట్ట విరుద్ధం. దానిని శుద్ధి చేయవలసిన అవసరం ఉంది. కాని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దీనిపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు కనిపించదు.

ఒక దశలో ఆధార్ కార్డుకు ఓటుకు లింక్ పెట్టాలన్న ఆలోచన జరిగినా దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ అభ్యంతరాలు చెప్పింది. ఓటు వేసినప్పుడు వేలు ముద్ర వేయడం ద్వారా సాంకేతికంగా డబుల్ ఓట్ల అక్రమాలను నివారించవచ్చన్న సూచన ఉన్నా ఎందుకు పట్టించుకోడం లేదు. మొత్తం వ్యవస్థను సరళీకరించి బోగస్ ఓట్లు లేకుండా చేయడం కన్నా, తమకు ఏది ప్రయోజనమో దానిపైనే అధికార పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్న భావన లేకపోలేదు.

పశ్చిమబెంగాల్, బీహారు రాష్ట్రాలలో ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టడం వివాదం అయింది. ఇది కేవలం బీజేపీ వ్యతిరేక ఓటర్లను తొలగించడానికి జరిగిన కుట్రగా కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు ఆరోపించాయి. ఈ అంశాన్ని జగన్ ప్రస్తావిస్తూ బెంగాల్‌లో 91 లక్షల ఓట్లను తొలగించారని, తమిళనాడులో 74 లక్షల ఓట్లు తొలగించారని అన్నారు. మమత బెనర్జీ పోటీచేసిన భవానీపూర్‌లో 45982 ఓట్లు తొలగిస్తే 15వేల తేడాతో ఆమె ఓడిపోయారని ఆయన చెప్పారు. స్టాలిన్ పోటీచేసిన కొలత్తూరులో 71 వేల ఓట్లు తీసివేస్తే, ఆయన 8వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారని ఉదాహరించారు. బెంగాల్‌లో 31 లక్షల ఓట్ల తేడాతో, తమిళనాడులో 17 లక్షల ఓట్ల తేడాతో టి.ఎమ్.సి,డి.ఎమ్.కె.లు ఓడిపోయాయని ఆయన వివరించారు.

ఏపీలో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోతే, ఆ రాష్ట్రాలలో ఓట్లు తీసివేయడం వల్ల ఓడిపోయారని, రెండూ ప్రమాదమేనని జగన్ వ్యాఖ్యానించారు. కుప్పం ఓట్ల బోగస్ వ్యవహరం ఒక హిస్టరీ మిస్టరీ అని అన్నారు. ఒక్కో బూత్ పరిధిలో ఏభై చొప్పున వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించినా ఐదువేల ఓట్ల వరకు పోయినట్లే అని ఆయన హెచ్చరించారు. అందువల్ల ప్రతి గ్రామంలో ఆ ఓట్ల తొలగింపు లేకుండా, బోగస్ ఓట్లు చేరకుండా అప్రమత్తంగా ఉండాలని జగన్ తన కేడర్‌కు పిలుపునిచ్చారు. అయితే మరో రెండేళ్ల వరకు అసెంబ్లీ ఎన్నికలు లేనందున, ఒకవేళ మరీ తేడా ఉంటే దానిపై పోరాటం జరిపి, సరిచేసుకునే అవకాశం ఉండవచ్చు.

ఏపీలో సీఈఓ ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేత పేర్నినాని చేసిన సూచనలు కూడా గమనించదగినవే. బూత్ లెవెల్ అధికారులు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లినప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఉండేలా చూడాలని అన్నారు. ఇంతవరకు ఉన్న ఓటర్ల జాబితాలను పార్టీలకు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. కాగా గత ఎన్నికల సమయంలో ఏపీలో 3500 బూత్‌లలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిపినట్లు చూపిన వైనంపైన, 49 లక్షల ఓట్లు అదనంగా ఎలా పోల్ అయ్యాయన్నదానిపైన ఇంతవరకు ఎన్నికలసంఘం వివరణ ఇవ్వలేకపోయింది.

వివిపాట్ స్లిప్‌లతో ఈవీఎమ్‌లను సరిపోల్చి చూపడంలో ఎన్నికల సంఘం విఫలం అయింది. వివిపాట్ స్లిప్‌లను కౌంటింగ్ జరిగిన పది రోజులకే దగ్దం చేయడం అనుమానాలకు దారితీసింది. అలాగే ఈవీఎమ్‌ల బాటరీ చార్జింగ్ కౌంటింగ్ నాటికి పెరిగిందన్న ఆరోపణపై జవాబు ఇవ్వలేకపోయారు.

ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరగకుండా చూసుకోవడానికి వైఎస్సార్‌సీపీ సన్నద్ధం అయింది. అయినా పలుచోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ నిత్యం ఫిర్యాదు చేయవలసి వస్తోంది. ఏది ఏమైనా రాజకీయ లక్ష్యంతో ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్లను అదనంగా చేర్చడం వంటివి జరగకుండా ఎన్నికల సంఘం నిజాయితీగా వ్యవహరించకపోతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడే ప్రమాదంలో పడుతుంది!


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement