Inauguration of PM Kisan Development Center at Shamirpet - Sakshi
Sakshi News home page

‘వన్‌ నేషన్‌ వన్‌ ఫర్టిలైజర్‌’ నినాదంతో ముందుకు..

Jul 28 2023 3:58 AM | Updated on Jul 28 2023 1:31 PM

Inauguration of PM Kisan Development Center at Sameerpet - Sakshi

శామీర్‌పేట్‌: వన్‌ నేషన్‌ వన్‌ ఫర్టిలైజర్‌ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌ జిల్లా, శామీర్‌పేటలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి కిసాన్‌ సంవృద్ధి కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని, రైతులతో కలిసి పీఎం నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించారు.

అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... రైతుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రధాని గురువారం దేశవ్యాప్తంగా 1.25 లక్షల పీఎంకేఎస్‌కే (ప్రధాన మంత్రి కిసాన్‌ సంవృద్ది కేంద్రం) లను జాతికి అంకితం చేశారన్నారు. ఈ కేంద్రాల్లో వ్యవసాయానికి అవసరమైన ప్రతీ పనిముట్టు, విత్తనాలు, భూసార పరీక్షలు, ఎరువులు లభ్యమవుతాయని, అద్దెకు డ్రోన్‌ స్ప్రేలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

పీఎంకేఎస్‌కే సిబ్బందికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో శిక్షణ ఇప్పించి, తద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామని ఆయన వెల్లడించారు. గ్రోమోర్‌ ప్రవేశపెట్టిన డీఏపీ నానో ఒక లీటర్‌ బాటిల్‌.. ఒక బస్తా డీఏపీతో సమానమని, దీన్ని రైతులు సది్వనియోగం చేసుకోవాలని సూచించారు.  

బీమా ఉంటే పరిహారం అందేది... 
తెలంగాణలో అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ ను ప్రజాప్రగతి భవన్‌గా మారుస్తామని కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని, రాష్ట్రంలో బీమా పథకం అమల్లో ఉండి ఉంటే రైతులకు పరిహారం అందేదని చెప్పారు.

ఫామ్‌హౌజ్‌లో, ప్రగతి భవన్‌లో పాలన సాగించే ముఖ్యమంత్రికి రైతుల గోసలు ఎలా తెలుస్తాయని, ప్రధానమంత్రి పంట బీమా పథకాన్ని రా ష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీ శా రు. ధరణి పోర్టల్‌ ద్వారా లేని సమస్యలను సృష్టించి, రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, కల్వకుంట్ల కుటుంబం అంటేనే తడి గుడ్డ తో గొంతుకోసే వారని తీవ్ర అసహనం వ్యక్తం చేశా రు. అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు. 

అరెస్టులకు భయపడేది లేదు 
గజ్వేల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నయా నిజాం తరహాలో ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఇటీవల చోటుచేసుసుకున్న ఘటనలో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ నేత మనోహర్‌ యాదవ్, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ గంగిశెట్టి చందన భర్త రవీందర్‌లను ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి గురువారం పరామర్శించారు. కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాగా పరామర్శ సందర్భంలో కిషన్‌రెడ్డి.. రవీందర్‌పై కాషాయ కండువా కప్పడానికి ప్రయతి్నంచగా ఆయన సున్నితంగా వారించారు.

Advertisement
 
Advertisement
Advertisement