సాక్షి, హైదరాబాద్: బీజేపీకి సంబంధించి సంస్థాగతంగా మూడు జిల్లాలకు అధ్యక్షులను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు నియమించారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా యు.రమేశ్, మేడ్చల్ మల్కాజిగిరి (అర్బన్) అధ్యక్షుడిగా డి.గిరివర్ధన్రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశం నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎన్.గౌతంరావు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పార్టీపరంగా సంస్థాగత జిల్లాలు 38 కాగా...గతంలోనే 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు.
అయితే తనను సంప్రదించకుండానే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖరరెడ్డిని నియమించడాన్ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వ్యతిరేకించారు. దీంతో కొన్ని రోజులకు ఆ జిల్లా అధ్యక్షుడిని తప్పించారు. అదేవిధంగా సుదీర్ఘకాలంపాటు కేంద్రమంత్రి బండి సంజయ్–మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ల మధ్య వైషమ్యాలు కొనసాగడంతో వారికి సంబంధించిన రెండుజిల్లాల్లో అధ్యక్షుల నియా మకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వ చ్చింది.
ఇటీవల హైదరాబాద్లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నివాసంలో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సమక్షంలో సంజయ్–రాజేందర్ల మధ్య సయోధ్య కుదిరింది. తాజాగా బుధవారం ఢిల్లీలో లక్ష్మణ్తో సంజయ్, రాజేందర్, విశ్వేశ్వర్రెడ్డి సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ మూడుజిల్లాల అధ్యక్షుల నియామకం విషయంలో ఏకాభిప్రాయం కుదరడంతో ఈ మేరకు ప్రకటన వెలువడినట్టుగా పార్టీ వర్గాల సమాచారం.


